రంగంలోకి మెగాస్టార్.. జగన్‌తో భేటీ

జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు తగ్గించడం.. ఏపీలో ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణికి దిగుతోందని ప్రతిపక్షాలు, సినీ పెద్దలు విమర్శలకు దిగుతున్నారు. టిక్కెట్ రేట్ల పెంపు వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి సినీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నది వాస్తవం. అయితే వారి వారి పరిస్థితుల రీత్యా సినిమా పెద్దలెవరూ నోరు విప్పలేదు. అయితే తొలిసారిగా నటుడు నాని, జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష విమర్శలు చేసి వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో చోటుచేసుకున్న మరో ఘటన ఏపీ ప్రభుత్వాన్ని మరింతగా కార్నర్ చేసింది.

కేసీఆర్ ప్రభుత్వం సినిమా రేట్లు పెంచేందుకు అనుమతించడంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరినట్టైంది. కేసీఆర్‌పై ప్రసంశల వర్షం కురిపించిన మెగాస్టార్.. ఏపీపై తన మౌనంతోనే విమర్శలు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. తెలంగాణ ప్రభుత్వంపై సినీ దిగ్గజాలు పొగడ్తలు కురిపిస్తున్నారు. విమర్శలకు, పొగడ్తలకు కారణం సినిమా టికెట్ ధరల పెంపే కారణం. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న.. రోజుల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరను పెంచింది. ఈ వివాదానికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మరింత ఆజ్యం పోసింది.

దీంతో ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు చిరంజీవి పూనుకున్నట్లు తెలుస్తోంది. సినీ రంగంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఆయన.. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో వివాదానికి తెర దించాలని మెగాస్టార్ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన జగన్‌తో భేటీ అవుతారని చెబుతున్నారు.

జగన్‌ తో భేటీ కంటే ముందు పేర్ని నానితో చిరంజీవి భేటీ అవుతారని.. ఈ భేటీలో చర్చించిన అంశాలను జగన్ ముందు చిరంజీవి ప్రస్తావిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడ్డట్లే.. సినీ రంగంపై కూడా పడింది. ఇప్పటికీ సినీ రంగం ఇంకా కొలుకోలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యపై కేసీఆర్‌ ను చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు కలిసి వివరించారు. సినీ పెద్దల భేటీ తర్వాత టికెట్ల ధరను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చిరంజీవి, విజయ్‌ దేవరకొండ పలువురు సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు కొట్టివేసింది. జీవో 35 విషయంలో కోర్టు జోక్యంతో సద్దుమణిగింది. అయితే ఇంతలోనే ఏపీ ప్రభుత్వం జీవో 142ను జారీ చేసింది. 142 జీవో ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ ఆధర్యంలోనే జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ జీవోతో మళ్లీ వివాదం మొదటికి వచ్చింది.