ముంద‌స్తుకు వెళ్తే కేసీఆర్‌కే న‌ష్టం!

తెలంగాణ‌ రాష్ట్ర సాధ‌న కోసం ఉద్యమం చేసిన పార్టీగా ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆ అభిమానంతోనే 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. అప్ప‌టి నుంచి రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్‌ను నిలిపేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగితే పార్టీకి న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లారు. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్యూహం ఫ‌లించి పార్టీ భారీ విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే విష‌యాన్ని చెప్ప‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు సూచించారు. ఆయ‌న మాట‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న‌కు ఇంటిలిజెన్స్ వ‌ర్గాల రిపోర్ట్‌తో పాటు ఇత‌ర మార్గాల్లో స‌మాచారం త‌ప్ప‌క అందుతుంది. దీంతో రాష్ట్రంలో మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది.

కానీ ఈ సారి కేసీఆర్ ఒక‌వేళ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే అది క‌చ్చితంగా ఆయ‌న‌కు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌తంలో అంటే టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం అలాగే ఉంది. మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు పుంజుకునేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. అందుకే అప్పుడు కేసీఆర్ ప్ర‌ణాళిక ఫ‌లించింది.

కానీ ఇప్పుడు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. నిరుద్యోగులు, రైతులు ప్ర‌భుత్వంపై మండి ప‌డుతున్నారు. ఇంకా అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాలు ఉన్నాయి. ద‌ళిత బంధు ప‌థ‌కం ఒక్క నియోక‌వ‌ర్గంలోనూ పూర్తిగా అమ‌లు కాలేదు. మ‌రోవైపు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ బ‌లంగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ జోరు మీదుంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే దెబ్బ ప‌డ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.