దేవినేని vs వంగ‌వీటి.. పొలిటిక‌ల్ ఫైట్‌?

విజ‌య‌వాడ రాజ‌కీయాలు మ‌రోసారి హీటెక్క‌బోతున్నాయి. కొన్నేళ్లుగా చ‌ల్లారిన వేడి తిరిగా రాజుకోనుంది. ఒక‌ప్పుడు రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన రాజ‌కీయ ఫైట్‌కు మ‌ళ్లీ రంగం సిద్ధ‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. మ‌రోసారి వంగ‌వీటి వ‌ర్సెస్ దేవినేని అనేలా రాజ‌కీయాలు సాగ‌నున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఏపీలో రాజ‌కీయ చైత‌న్యం మెండుగా ఉన్న కృష్ణా జిల్లా ఎప్పుడూ ఒకే పార్టీ వైపు నిల‌బ‌డ‌దు. 2014లో టీడీపీకి జై కొట్టిన ఆ ఓట‌ర్లు.. 2019లో వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇక ఆ జిల్లాలో విజ‌య‌వాడ పాలిటిక్స్ అంత‌కుమించి. 2019 ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ రెండు స్థానాల్లో మాత్ర‌మే గెలిచింది. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌ద్దె రామ్మోహ‌న్‌, గ‌న్న‌వ‌రం నుంచి వ‌ల్ల‌భ‌నేని వంశీ గెలిచారు. కానీ వంశీ వైసీపీకి జై కొట్ట‌గా.. రామ్మోహ‌న్ టీడీపీలోనే కొన‌సాగుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత జిల్లాలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాలు పార్టీని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నాల్లో భాగంగా బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వంశీకి పోటీగా రామ్మోహ‌న్‌ను గ‌న్న‌వ‌రం పంపి.. విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి వంగ‌వీటి రాధాను బ‌రిలో దింపాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా చెబుతున్నారు. గ‌తంలో2004లో విజ‌య‌వాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా రాధ ప‌ని చేశారు. 2009లో ప్ర‌జారాజ్యం త‌ర‌పున సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఈస్ట్‌లో బ‌రిలో దిగి ప‌రాజ‌యం చెందారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేరినా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.

ఇటీవ‌ల మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతున్న రాధా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జీగా దేవినేని నెహ్రూ త‌నయుడు దేవినేని అవినాష్ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాధా ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తే బెజ‌వాడ రాజ‌కీయాలు మ‌ళ్లీ హీటెక్క‌డం ఖాయం. గ‌తంలో ఇక్క‌డ వంగ‌వీటి వ‌ర్సెస్ దేవినేని అనేలా రాజ‌కీయాలు సాగాయి. కొంత కాలం విరామం త‌ర్వాత మ‌ళ్లీ అదే ప‌రిస్థితి పున‌రావృతం అయ్యేలా క‌నిపిస్తోంది.