జగన్ ముందే బయటపడ్డ వర్గపోరు..?

బెల్లం ఎక్కడ ఉంటే అక్కడకు చీమలు.. ఈగలు ఇట్టే వచ్చేస్తాయి. అలాంటిది అధికారం పక్షం అన్నంతనే పెద్ద ఎత్తున నేతలు పోలోమంటూ వచ్చేస్తారు. పార్టీ పవర్ లో లేనప్పుడు కనిపించని నేతలు.. పవర్ చేతికి వచ్చిన తర్వాత.. చుట్టూ ముగిపోతారు. అంతేకాదు.. పవర్ లో ఉన్నప్పుడు నేతల మధ్య విభేదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి ఏపీ అధికారపక్షంలో ఉన్నప్పటికీ.. వాటికి చేయాల్సిన శస్త్రచికిత్సను అధినేత జగన్మోమన్ రెడ్డి చేయటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.

అలాంటి సమయంలో తన అడ్డా లాంటి సొంత జిల్లాలో పార్టీ నేతల మధ్య లుకలుకల్ని జగన్ గమనించారని చెప్పాలి.
ఇంతకూ జరిగిందేమన్నది చూస్తే.. కడప జిల్లా ప్రొద్దుటూరులో బహిరంగ సభను నిర్వహించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సభకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. బీసీ సామాజిక నేత కమ్ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ లు హాజరయ్యారు. వీరిద్దరి మధ్య పవర్ ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయినప్పటికి తమ మధ్య విభేదాల్ని మరిచి సీఎం జగన్ సభకు హాజరయ్యారని భావించారు. కానీ.. తమ విభేధాలు బయటకు రాకుండా చూసుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. సీఎం జగన్ తో పాటు.. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డి.. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా..జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్.. మున్సిపల్ ఛైర్ పర్సనర్ లక్ష్మీదేవిలకు మాత్రమే డయాస్ మీద మాట్లాడే అవకాశాన్ని ఇచచారు.

అందరూ అయ్యాక సీఎం జగన్ మాట్లాడాల్సిన వేళ.. వేదిక మీద ఉన్నా.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ చేతికి మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు. దీంతో మైకు అందుకున్న రమేశ్ మాట్లాడటం మొదలు పెట్టినంతనే.. సభకు హాజరైన ఆయన అభిమానులు.. ఫాలోయర్స్ కేరింతలు కొట్టారు. తాజా ఉదంతాన్ని చూస్తే.. జిల్లాల వారీగా లుకలుకలు.. పార్టీలో పెరుగుతున్న వర్గ పోరును సీఎం జగన్ ఒక కంట కనిపెడుతున్నారన్న అంశం తాజా ఎపిసోడ్ తో అర్థమైందని చెప్పక తప్పదు.