కేరళ కుట్టికి టాలీవుడ్ వరాలు

కేరళ అమ్మాయిలు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లుగా వెలగడం ఎప్పటి నుంచో ఉన్నదే. అప్పటి రేవతి, శోభన నుంచి ఇప్పటి నయనతార, నిత్యామీనన్, సమంతల వరకు ఎందరో కేరళ కుట్టిలు తెలుగు ప్రేక్షకుల్ని తమ అందంతో, నటనతో మెప్పించారు. ఇప్పుడీ లిస్టులో మరో అమ్మాయి చేరుతోంది. తనే సంయుక్తా మీనన్.

కొద్ది రోజుల క్రితం వరకు ఈ అమ్మాయి గురించి తెలుగు వారికి అంతగా తెలీదు. ‘భీమ్లానాయక్‌’లో రానాకి జోడీగా తన పేరును అనౌన్స్ చేశాకే ఈమె ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారంతా. పాప్‌కార్న్ అనే మలయాళ చిత్రంతో తన కెరీర్‌‌ని స్టార్ట్ చేసింది సంయుక్త. ‘కలరి’ అనే సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘గాలిపట’ చిత్రంతో కన్నడిగుల ముందుకీ త్వరలో వెళ్లబోతోంది. ఇంతలో ఇటు తెలుగులోనూ చాన్స్ కొట్టేసింది.

విశేషమేమిటంటే.. భీమ్లానాయక్ ఇంకా రిలీజ్ కాకముందే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో సంయుక్త చోటు దక్కించుకుంది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ సినిమా రానున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇందులో సంయుక్తనే హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ చేసినట్లు ప్రకటించారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌‌ సినిమాస్‌తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ తెలుగు, తమిళ బైలింగ్వల్‌ మూవీని నిర్మిస్తున్నారు.

ఓ కొత్త అమ్మాయికి ఇలా బ్యాక్ టు బ్యాక్‌ బిగ్ ప్రాజెక్ట్స్‌లో చోటు దక్కడం చిన్న విషయం కాదు. సంయుక్తకి అలా కలిసొచ్చిందంతే. పోయినేడు ‘ఆనమ్ పెన్నుమ్ వెళ్లమ్ వుల్ఫ్’ అనే చిత్రానికి గాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అందుకుంది సంయుక్త. తన స్పీడు చూస్తుంటే తర్వలో బిజీ హీరోయిన్ అయిపోయి మరిన్ని అవార్డులూ రివార్డులూ తన ఖాతాలో వేసేసుకుంటుందనిపిస్తోంది.