ఒమిక్రాన్ ఎఫెక్ట్: దేశం దిగ్బంధం.. నైట్ క‌ర్ఫ్యూ షురూ!

ఒమిక్రాన్‌.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విదేశాల‌నే ద‌డ‌ద‌డ‌లాడిస్తోంద‌ని అనుకున్న క‌రోనాలో కొత్త‌రకం వైర‌స్ ఇప్పుడు భార‌త్‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. దీంతో దేశాన్ని దిగ్బంధించాలని.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపింది. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని పేర్కొంది. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పండగల వేళ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలని కేంద్రం స్ప‌ష్టం చేసింది. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని తెలిపింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పరిగణించి, అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. బాధితుల నమూనాలను ఆలస్యం చేయకుండా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపింది. పాజిటివిటీ రేటు, డబ్లింగ్‌ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలని మ‌రింత స్ప‌ష్టంగా ఆదేశించింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్‌, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.

రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని కేంద్రం నిర్దేశించింది. మాస్క్‌లు ధ‌రించ‌డం, భౌతికదూరం పాటించ‌డం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలని తెలిపింది. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని, జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల‌ని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్రం తెలిపింది. దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటిందని తెలిపింది.