గుండెపోటుతో వివేకా మరణించారన్న ప్రచారం చేసింది అతడేనట

కీలక అంశాన్ని గుర్తించింది సీబీఐ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతంగురించి తెలిసిందే. అయితే.. వివేకా హత్యకు గురయ్యారన్న విషయం బయటకు రావటానికి ముందు.. ఆయనకు గుండె పోటు వచ్చిందని.. బాత్రూంలో కుప్పకూలిపోయారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మిగిలిన మీడియా సంస్థల సంగతి ఎలా ఉన్నా.. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలోనూ.. ఇదే తరహా కథనాలు ప్రసారమయ్యాయి.

అయితే.. వైఎస్ వివేకా మరణ వార్త లోకానికి తెలిసిన కాసేపటికే.. ఆయన మరణించింది గుండె పోటుతో కాదని.. దారుణ హత్యకు గురైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ తర్వాతే సీఎం జగన్ కుటుంబానికి చెందిన మీడియాలోనూ పాత వాదనకు చెక్ చెప్పి.. కొత్త వాదనను వినపించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సొంత బాబాయ్ దారుణ హత్యకు గురైతే.. ఆ వార్తను గుండెపోటు వార్తగా ఎలా టెలికాస్ట్ చేశారన్నది ఇప్పటికి అర్థం కాని ప్రశ్నగా మారింది.

అయితే.. గుండెపోటుతో మరణించారంటూ తప్పుడు ప్రచారానికి కారణమైన వారిని తాజాగా సీబీఐ గుర్తించింది. ఈ తప్పుడు సిద్ధాంతంతో అందరిని మాయ చేయాలన్న ప్లాన్ చేసిన వారిలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిగా సీబీఐ గుర్తించింది. వివేకా డెడ్ బాడీ రక్తపు మడుగులో పడి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేసింది శివశంకర్ రెడ్డినేనని.. ఇదే విషయాన్నిఆయన సాక్షి టీవీకి కూడా చెప్పినట్లుగా సీబీఐ వెల్లడించింది.

వివేకా గుండెపోటుతో మరణించారని అందరూ నమ్మేందుకు వీలుగా ఆయన పడక గది.. స్నానపు గదిలో రక్తపు మరకల్ని తుడిచేశారని.. హత్యకు సంబంధించిన ఆధారాలన్నింటిని ధ్వంసం చేసినట్లుగా సీబీఐ పేర్కొంది. అంతేకాదు.. వివేకా ఒంటి మీద ఉన్న గాయాలకు గజ్జల జై ప్రకాశ్ రెడ్డి అనే కాంపౌడర్ చేత బ్యాండేజీ వేయించి.. కట్లు కట్టించినట్లుగా గుర్తించామన్నారు. తాజాగా శివశంకర్ రెడ్డి పాత్రపై తమకు లభించిన ఆధారాల్ని కోర్టు ముందు ఉంచింది సీబీఐ. అంతేకాదు.. కేసు కీలక దశలో ఉందని.. ఇలాంటి వేళలో శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని.. ఒకవేళ ఇస్తే.. సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందన్నారు.

ఈ వాదనకు నిదర్శనంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరిని శివశంకర్ రెడ్డి ఈ ఏడాది మార్చిలో తన స్నేహితుడైన భయపురెడ్డి ఇంటికి పిలపించారని.. సీబీఐ ఎదుట నా పేరు కానీ.. మిగితా వాళ్ల పేర్లు కానీ చెప్పొద్దని బెదిరించారన్నారు. అలా చేస్తే.. నీ జీవితాన్ని సెటిల్ చేస్తానని దస్తగిరికి వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. వివేకాను హత్య చేస్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమకు రూ.40 కోట్లు ఇస్తానని చెప్పారని.. దీని వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఉన్నట్లు ఎర్ర గంగిరెడ్డి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి.. షేక్ దస్తగిరిలతో చెప్పిన దస్తగిరి.. వాచ్ మన్ రంగన్న వాంగ్మూలాన్ని గుర్తుచేశారు. మొత్తంగా తప్పుడు ప్రచారానికి సూత్రధారి ఎవరన్న విషయంపై సీబీఐ క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి.