జిన్నాకు.. మోడీకి తేడాలేదు: మాజీ సీఎం

“న‌రేంద్ర మోడీ లాంటివారు.. బ్రిటీష‌ర్ల కాలంలోనూ ఉన్నారు. అప్ప‌ట్లో వాళ్లు.. బ్రిటీష్ వారి బూట్లు నాకారు. ఇప్పుడు కార్పొరేట్ల బూట్లు నాకుతున్నారు.“ అని జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి,  పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహ‌బూబా ముఫ్తీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోడీ స‌ర్కారును, బీజేపీని ఆమె తూర్పార‌బ‌ట్టారు. గ‌తానికి భిన్నంగా.. ఆమె నిప్పులు చెరిగారు.  

స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని వారు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వారు ఈ రోజు దేశ ప్రజలకు దేశభక్తి గురించి లెక్చర్లు ఇస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మెహబూబా మాట్లాడుతూ బీజేపీని జిన్నాతో పోల్చారు. ‘‘ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జవహార్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్ సయ్యద్ అహ్మద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌లతో సమ పోరాటం చేసిన మహ్మద్ అలీ జిన్నాను మనం ఈరోజు విమర్శిస్తున్నాం.

ఎందుకంటే ఆయన మీద మనకు ఒక ఫిర్యాదు ఉంది. ఈ దేశ విభజనకు కారకుడని ఆయన పక్కన పెట్టేశాం. హిందూ-ముస్లింల ప్రాతిపదికన జిన్నా ఈ దేశాన్ని విడదీశారు. కానీ ఈ రోజు దేశంలో జరుగుతున్నదేంటి? ఎంతో మంది జిన్నాలు ఈ దేశంలోని ప్రజలను అదే మత ప్రాతిపదికన విడదీస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, బ్రిటిషర్ల బూట్లు శుభ్రం చేసిన వాళ్లు ఈరోజు మనకు దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారు’’ అని మెహబూబా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

మెజారిటీ ప్ర‌జ‌ల ప్రాతిప‌దిక‌న‌.. రాజ్యాంగాన్ని విస్మ‌రిస్తున్నార‌ని.. ముఫ్తీ అన్నారు. లౌకిక వాదం కేవ‌లం పుస్త‌కాల‌కు మాత్ర‌మే, చ‌దువుకునేందుకు మాత్ర‌మే ఉప‌యోగ ప‌డుతున్న ప‌దంగా ఆమె పేర్కొన్నారు. ఇప్ప‌టికి ఏడు సంవ‌త్స‌రాలుగా.. దేశంలో ఒక్క కులం, ఒక్క మతం ప్రాతిప‌ప‌దిక‌న రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని, కేవ‌లం ముస్లింల‌ను టార్గెట్‌చేసుకుని.. మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల‌ను అంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌ని.. ముఫ్తీ అన్నారు. ఇలాంటివారివ‌ల్ల‌.. ఈ దేశం ఏమైపోతుందో.. అంద‌రూ గుర్తించాల‌ని పౌర‌స‌మాజానికి పిలుపునిచ్చారు. “మీరు మాట్లాడొద్దు.. మీరు బ‌య‌ట‌కు రావ‌ద్దు… నినాదంతో మోడీ స‌ర్కారు ప‌నిచేస్తోంద‌న్నారు. ఈ దేశంలో పుట్ట‌డాన్ని నేరంగా ముస్లింలు భావిస్తున్నార‌ని.. అన్నారు. ప్ర‌స్తుతం ముఫ్తీ వ్యాఖ్య‌లు సంచ‌ల‌న సృష్టిస్తున్నాయి. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.