అల వైకుంఠపురం రీమేక్.. టబు వార్నింగ్

నటిగా టబుది ఓ డిఫరెంట్ జర్నీ. ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి కమర్షియల్ హిట్ చిత్రాల్లో నటించింది. ‘చాందినీబార్‌‌’లాంటి సీరియస్‌ కాన్సెప్టులతోనూ మెప్పించింది. ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకుంది. కెరీర్ మొదట్నుంచీ కూడా ఏది పడితే అది చేసేయకుండా ఓ ప్రత్యేకతను చూపించుకుంటూ వచ్చింది. ఇప్పటికీ అదే తీరు. అందుకే తనపై అందరికీ ఓ స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది.      

చాలా గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది టబు. రిచ్ ఉమన్‌గా.. భర్త చేసిన మోసంతో తనలో తనే రగిలిపోయే భార్యగా.. కొడుకే ప్రపంచం అనుకునే తల్లిగా.. అన్ని రకాల ఎమోషన్స్‌ని తనదైన శైలిలో పండించి వహ్వా అనిపించింది. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ టీమ్‌కి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టబు.       కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘షెహ్‌జాదా’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది ‘అల వైకుంఠపురములో’.

దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌ గిల్ నిర్మిస్తున్నారు. కృతీ సనన్ హీరోయిన్. షూటింగ్ జోరుగా సాగుతోంది. లొకేషన్‌లో డైరెక్టర్‌‌తో దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కార్తీక్. అది చూసిన టబు.. ‘జాగ్రత్తగా రీమేక్ చేయండి.. అది నా సినిమా’ అని కామెంట్ చేసింది. దానికి ఆర్యన్ కూడా రియాక్టయ్యాడు. ‘మీ సినిమా కనుకనే మరింత ప్రేమతో తీస్తున్నాం’ అని జవాబిచ్చాడు.       

అల వైకుంఠపురములో బన్నీ కెరీర్‌‌లోనే ఓ స్పెషల్ మూవీ. ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. రికార్డులు బద్దలు కొట్టింది. ముఖ్యంగా పాటలు, వాటిలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అదరగొట్టాయి. అలాంటి సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అందరి దృష్టీ ఉండటం కామన్. అయితే టబు పాత్రని హిందీలో కూడా ఆమే చేసివుంటే బాగుండేదని చాలామంది ఫీలవుతున్నారు. కానీ చేసిన పాత్రే మళ్లీ చేయడానికి ఆమె ఒప్పుకోలేదట. దాంతో మనీషా కొయిరాలాని తీసుకున్నారు. ఆమె కూడా మంచి నటే కానీ టబు ఉంటే ఆ హుందాతనమే వేరు అనేది ఎక్కువమంది ఫీలింగ్.