బాబు వాలంటీర్లు.. జ‌గ‌న్‌కు కౌంటరా !

తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్ ఉండాల‌న్నా.. త‌న రాజ‌కీయ మ‌నుగడ కొన‌సాగాల‌న్నా ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అత్య‌వ‌స‌రం. అందుకే 2024లో జ‌రిగే ఎన్నిక‌ల‌పై బాబు ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. ఆ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. జ‌గ‌న్‌కు ఎలాగైనా చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో ఓ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ఆలోచ‌న‌నే బాబు అందుకుని ప్ర‌త్య‌ర్థికి షాక్ ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఓ వాలంటీర్‌ను నియ‌మించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాల‌ను, పింఛ‌న్ల‌ను ఇత‌ర సేవ‌ల‌నూ ఈ వాలంటీర్లే అందిస్తున్నారు. ప్రభుత్వం చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వీళ్లే చేర‌వేస్తున్నారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించేలా ఈ వాలంటీర్ల వ్య‌వ‌స్థ త‌న‌కు మేలు చేస్తుంద‌ని జ‌గ‌న్ ధీమాతో ఉన్నారు. ఈ విషయాన్ని గ్ర‌హించిన చంద్ర‌బాబు ఇప్ప‌టికే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై విమ‌ర్శ‌లు చేశారు. కానీ మాట‌ల‌తో లాభం లేదని  భావించిన ఆయ‌న‌.. త‌న పార్టీ త‌ర‌పున కూడా ఇలాగే వాలంటీర్ల‌ను నియ‌మించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది.

Chandarరాష్ట్రవ్యాప్తంగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వాలంటీర్ల‌ను నియ‌మించేందుకు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు జ‌రిపి నేత‌ల‌తో బాబు చ‌ర్చించ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక టీడీపీ వాలంటీర్‌ను నియ‌మిస్తార‌ని టాక్ న‌డుస్తోంది. వ‌చ్చే ఏడాదికి వీళ్ల నియామ‌కం పూర్తి చేయాల‌ని అనుకుంట‌న్న‌ట్లు తెలిసింది. ఈ వాలంటీర్ల‌కు పార్టీ నుంచి కొంత గౌర‌వ వేత‌నం కూడా చెల్లించే అవ‌కాశం ఉంది. వాళ్ల‌కు కేటాయించిన కుటుంబాల ద‌గ్గ‌ర‌కు వెళ్లి వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను గ‌తంలో టీడీపీ చేసిన అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డ‌మే ఈ వాలంటీర్ల ప‌ని. బాబు ఆలోచ‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో అది ప‌క‌డ్భందీగా అమ‌లువుతుందా? అన్న‌దే సందేహంగా మారింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.