బాబు మోహ‌న్ ఎక్క‌డి వారో తెలిసింది..!

సినీ హాస్య న‌టుడు, అందోలు మాజీ ఎమ్మెల్యే ప‌ల్లె బాబు మోహ‌న్ ఎక్క‌డి వారో తెలిసింది. అందోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు గెలిచి చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన బాబు మోహ‌న్ అందోలుకు స్థానికేత‌రుడే అని తేలిపోయింది. కొందరు ఆయ‌న‌ది ఖ‌మ్మం జిల్లా అని చెబుతున్నాఅది వాస్తవం కాద‌ని నిరూపితం అయింది. ఈ విష‌యంపై బాబు మోహ‌నే స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన స‌మ‌యంలో ఆయ‌న సూచ‌న మేర‌కు బాబు మోహ‌న్ పార్టీలో చేరారు. 1999లో టీడీపీ నుంచి అందోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అయితే అంత‌కు ముందు బాల‌యోగి లోక్‌స‌భ స్పీక‌ర్ అవ్వ‌డంతో ముమ్మ‌డివ‌రం నుంచి ఉప ఎన్నిక‌ల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో మాత్రం ఆందోల్‌కు మారారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకున్నారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి దామోద‌ర రాజ‌న‌ర్సింహ చేతిలో ఓడిపోయారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌డంతో టీడీపీకి ఇక్క‌డ స్థానం లేద‌ని భావించిన బాబు మోహ‌న్ తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ను ఓడించారు. 2018లో పార్టీ అధినేత కేసీఆర్ బాబు మోహ‌న్ కు టికెట్ నిరాక‌రించారు. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరి అందోలు నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ నుంచే టికెట్ తెచ్చుకొని ఎలాగైనా గెల‌వాల‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవ‌ల మ‌హబూబాబాద్ జిల్లాలో బీజేపీ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల స‌మావేశం నిర్వ‌హించింది. ముగింపు స‌మావేశాల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన బాబు మోహ‌న్ త‌న స్థానిక‌త విష‌యం బ‌య‌ట‌పెట్టారు. త‌న‌ది మానుకోట అనే విష‌యాన్ని వెల్ల‌డించారు. పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు ఈ విష‌యాల‌ను ఆస‌క్తిగా విన్నారు. బాబు మోహ‌న్ పుట్టింది మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సింహులుపేట మండ‌లం బొజ్జ‌న్న‌పేట.

అయితే.. అక్ష‌రాభ్యాసం చేసింది కుర‌వి మండ‌లం బ‌ల‌పాల. త‌ర్వాత త‌మ కుటుంబాన్ని ఖ‌మ్మం జిల్లాకు మార్చారు. తిరుమ‌లాయ‌పాలెం మండలం బీరోలు అమ్మ‌మ్మ ఊరు అయితే.. సుబ్లేడు వ‌ద్ద హుస్నాబాద్ నాన‌మ్మ ఊరు అని చెప్పారు. మ‌హ‌బూబాబాద్‌లో మేన‌త్త ఉండేవార‌ని.. చ‌దువుకునే రోజుల్లో త‌ర‌చుగా ఇక్క‌డికి వ‌స్తుండే వాడిన‌ని తెలిపారు. విద్యాభ్యాసం పూర్త‌య్యాక హైద‌రాబాద్ వెళ్లి సినిమా రంగంలో స్థిర‌ప‌డ్డాన‌ని.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మానుకోట‌కు వ‌చ్చే అవ‌కాశం దొరికింద‌ని ఆనందాన్ని వెలిబుచ్చారు.