టీఆర్ఎస్‌ను వీడ‌ని ఖ‌మ్మం నీడ‌..!

ఖ‌మ్మం గులాబీ పార్టీలో నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయా..? నిను వీడ‌ని నీడ‌ను నేను.. త‌ర‌హాలో ఒక‌టి కాకుంటే మ‌రొక‌టి గొడ‌వ‌లు పార్టీని చుట్టుముడుతున్నాయా..? ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే ఇవే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. పార్టీ పెద్ద‌లు ఈ వ‌రుస వ్య‌వ‌హారాల‌పై ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌. ఈ జిల్లాలో గొడ‌వ‌ల‌ను స‌ద్దుమ‌ణిగించేందుకు ప్ర‌త్యేకంగా ఒక క‌మిటీని వేయ‌నున్నార‌ట‌.

ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఉన్న ఓట్ల కంటే అధికంగా వ‌చ్చాయి. దాదాపు 150కి పైగా ఓట్లు టీఆర్ఎస్ నుంచి హ‌స్తం పార్టీకి క్రాస్ అయ్యాయ‌ని స‌మాచారం. ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా గుర్రుగా ఉన్నారు. ఇంటి దొంగ‌ల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారు. ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన‌ ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఒక‌రు.. ఒక‌ మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎంపీ.. మాజీ మంత్రి హ‌స్తం కూడా ఉంద‌ని పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.

ఈ విష‌యం ఇలా ఉండ‌గానే.. పార్టీలో మ‌రో అల‌జ‌డి చెల‌రేగింది. ఇందుకు సుజాత‌న‌గ‌ర్ ఎంపీపీ ప‌ద‌వి కార‌ణం అయింది. ఈ ప‌ద‌వి కోసం పార్టీలో ర‌చ్చ మొద‌లైంది. తొలుత ఈ ప‌ద‌వి కోసం ఇద్ద‌రు ఎంపీటీసీలు చెరో రెండున్న‌ర సంవ‌త్స‌రాల కాలం ఉండాల‌ని తీర్మానించార‌ట‌. వ‌చ్చే నెల‌తో మొద‌టి గ‌డువు ముగుస్తుండ‌డంతో రెండో ఎంపీటీసీ ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. అయితే ఇక్క‌డే అస‌లైన చిక్కు వ‌చ్చింది. ప‌ద‌వి నుంచి దిగిపోయేందుకు మొద‌టి ఎంపీటీసీ నిరాక‌రిస్తున్నార‌ట‌.

2019లో జ‌రిగిన సుజాత‌న‌గ‌ర్ ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ 3.. కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచాయి. సీపీఐ, ఇండిపెండెంట్ అభ్య‌ర్థి చెరో స్థానం గెల్చుకున్నారు. అధికార పార్టీ నేత‌లు త‌మ‌కే ఎంపీపీ ప‌ద‌వి ద‌క్కేలా పావులు క‌దిపారు. ఇండిపెండెంట్ అభ్య‌ర్థి అనిత‌కు ఎంపీపీ ప‌ద‌వి ఆశ పెట్టి ఆమెను పార్టీలో చేర్చుకున్నారు. త‌ర్వాత వెంట‌నే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీటీసీలు కారెక్కారు. దీంతో పార్టీ పెద్ద‌లు మంత్రాంగం జ‌రిపి.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన విజ‌య‌ల‌క్ష్మికి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు.. అనిత‌ రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ప‌ద‌వి పంచుకునేలా ఒప్పించారు.

తొలుత ప‌ద‌వి చేప‌ట్టిన‌ విజ‌య‌ల‌క్ష్మి ప‌ద‌వీ కాలం జ‌న‌వ‌రిలో ముగుస్తుంది. మ‌రో రెండున్న‌ర సంవ‌త్స‌రాల ప‌ద‌వీ కాలాన్ని అనిత‌కు అప్ప‌గించాల్సి ఉంది. తీర్మాన ప‌త్రంలో కూడా ఇలాగే రాసుకున్నారు. అయితే ఇప్పుడు విజ‌య‌ల‌క్ష్మి ఈ ప‌ద‌విని వ‌దిలేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. మిగ‌తా ట‌ర్మ్ కూడా త‌నే ఉండాల‌ని కోరుకుంటున్నార‌ట‌. దీంతో పార్టీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. త‌న‌కు న్యాయ‌మైన ప‌ద‌వీ కోటా రాకుంటే ఎంత దూరం అయినా వెళ‌తాన‌ని అనిత హెచ్చ‌రిస్తున్నారు. పార్టీ పెద్దలు వెంట‌నే ఈ విష‌యంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గులాబీ పెద్ద‌లు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాలి.