మనసు దోచేసిన తారక్ మాటలు

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన ఏ ప్రోమో చూసినా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కెమిస్ట్రీ ఎంత గొప్పగా పండిందో అర్థమవుతూనే ఉంది. ‘నాటు నాటు’ పాటలో వాళ్లిద్దరూ ఎంత మంచి సింక్‌లో డ్యాన్స్ చేశారో తెలిసిందే. ఇతర ప్రోమోల్లోనూ ఇద్దరి మధ్య మంచి సమన్వయం కనిపించింది. ఈ సినిమాకు పని చేసే క్రమంలో ఇద్దరూ మంచి స్నేహితులవడంతో తెరపై కెమిస్ట్రీ అలా పండిందేమో అని అంతా అనుకుంటున్నారు.

కానీ అది తప్పని.. తామిద్దరం ముందు నుంచి మంచి స్నేహితులు కావడం వల్లే ఈ సినిమాలో ఆ సమన్వయం, సింక్, కెమిస్ట్రీ కనిపిస్తోందని తారక్, చరణ్ అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో వాళ్లెంత మంచి స్నేహితులనేది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. తాజాగా ముంబయిలో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్లో తారక్-చరణ్‌ల అనుబంధం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఈవెంట్లో ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడుకున్నట్లు అందులో పాల్గొన్న వారు చెబుతున్నారు. ఈ ఈవెంట్ లైవ్ ఇవ్వకపోయినా.. మొబైళ్లలో తీసిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా తారక్ మైకందుకున్నపుడు మాట్లాడిన తొలి మాటల తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి తారక్, చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున స్పెషల్ బస్సుల్లో తరలి వెళ్లారు. ఈవెంట్లో వారు తమ అభిమాన కథానాయకుల నినాదాలతో హోరెత్తించారు.

కాగా తారక్ మైకందుకున్నపుడు.. అందరికీ నమస్కారం అని చెప్పి రామ్ చరణ్ అభిమానులకు స్వాగతం అన్నాడు. తన అభిమానులను పలకరించకుండా చరణ్ అభిమానుల పేరెత్తాడే అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే దీనికి కొనసాగింపుగా తారక్ మాట్లాడుతూ.. ఇక్కడ రామ్ అంటే తాను అని, చరణ్ అంటే రామ్ చరణ్ అని అందుకే ఇరువురి అభిమానులను ఉద్దేశించి ఇలా సంబోధించానని చెప్పి అందరి మనసూ దోచేశాడు. తమ ఇద్దరి కలయికను బహుశా దేవుడు నిర్ణయించి ఉంటాడని తారక్ వ్యాఖ్యానించాడు.