‘మెగా’ ఫ్యామిలీ మెసేజ్.. ఆ ఇద్దరూ మిస్సింగ్

కరోనాపై పోరులో టాలీవుడ్ చాలా చురుగ్గా వ్యవహరించడంలో మెగాస్టార్ చిరంజీవిది కీలక పాత్ర. ముందుగా ఇండస్ట్రీలో పనులు ఆగిపోగిపోయి కష్టాలు పడుతున్న కార్మికుల కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చి మిగతా వాళ్లందరినీ కదిలించాడు. భారీగా విరాళాలు పోగయ్యేలా చేశాడు. ఈ సహాయ కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న చిరు.. జనాల్లో కరోనాపై అవగాహన పెంచే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

నాగార్జున, సాయిధరమ్ తేజ్, వరుణ్‌ తేజ్‌లతో కలిసి ఓ పాట చేసిన చిరు.. వివిధ ఇండస్ట్రీల ప్రముఖులతో కలిసి ఓ క్రియేటివ్ ఏవీలోనూ భాగమయ్యారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు జనాలకు వీడియోల ద్వారా సందేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు చిరు మరో మంచి ప్రయత్నం చేశారు. మెగా ఫ్యామిలీలోని అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కరోనా మీద చక్కటి సందేశాన్ని ఇచ్చాడు చిరు.

మెగా ఫ్యామిలీ సభ్యులందరినీ భాగస్వాముల్ని చేస్తూ ఒక్కొక్కరు ఒక్కో ప్లకార్డు పట్టుకునేలా చేశాడు చిరు. వాళ్ల ప్లకార్డులన్నింట్లోని పదాల్ని కలిపితే కరోనా మీద చక్కటి సందేశం వస్తోంది. ‘ఇంట్లో ఉంటాం. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమని పంచుతాం. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం’ అనే సందేశాన్ని ఇచ్చింది మెగా ఫ్యామిలీ దీని ద్వారా.

వరుస క్రమంలో చిరుతో మొదలుపెడితే అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఇందులో భాగస్వాములయ్యారు. ఐతే ఇంతమంది ఉన్నారు కానీ.. ఇద్దరు మెగా ఫ్యామిలీ సూపర్ స్టార్లు మాత్రం ఇందులో మిస్సయ్యారు. వాళ్లే.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్.

పవన్ ఇలాంటి వాటిలో భాగస్వామి అవుతాడని ఎవ్వరూ అనుకోరు. కానీ అల్లు అర్జున్ ఇందులో పార్టిసిపేట్ చేయకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే ఎవరు మిస్సయ్యారన్నది పక్కన పెడితే ఈ మెసేజ్ అయితే సోషల్ మీడియాలో జనాలకు బాగా రచ్ అవుతోంది.