రాజ‌మౌళి ‘బ్రహ్మస్త్ర’

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇప్ప‌టిదాకా ఏ చిత్రానికి పూర్తి స్థాయి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఐతే త‌న మిత్రుడైన సాయి కొర్ర‌పాటి నిర్మించిన అందాల రాక్ష‌సి చిత్రానికి మాత్రం స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. ఆ త‌ర్వాత ఇంకెప్పుడూ ఆ పాత్ర కూడా పోషించ‌లేదు. ఐతే ఆయ‌న చాలా ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ప్రెజెంటర్ కాబోతున్నారు. అది ఒక బాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ మూవీకి కావ‌డం విశేషం. ఆ చిత్ర‌మే.. బ్ర‌హ్మాస్త్ర‌.

ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, అక్కినేని నాగార్జున, అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న బ్ర‌హ్మాస్త్ర‌ను అగ్ర ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి చిత్రం బాహుబ‌లిని హిందీలో రిలీజ్ చేసి అది నార్త్ ఇండియాలోనూ బంప‌ర్ క్రేజ్ తెచ్చుకోవ‌డంలో, బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంలో కీల‌క పాత్ర పోషించింది క‌ర‌ణ్ జోహారే. ఈ సినిమా సంద‌ర్భంగా ఏర్ప‌డిన అనుబంధంతో క‌ర‌ణ్‌.. రాజ‌మౌళిని బ్ర‌హ్మాస్త్ర సినిమాలో భాగం చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

బ్ర‌హ్మాస్త్ర సౌత్ వెర్ష‌న్ల‌న్నింటికీ జ‌క్క‌న్న స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. తెలుగులో బ్ర‌హ్మాస్త్ర పేరుతో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా.. హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ దీని ఫ‌స్ట్ పోస్ట‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో రాజ‌మౌళి పాల్గొన్నాడు.
ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మాస్త్ర‌లో భాగం కావ‌డం గురించి రాజ‌మౌళి మాట్లాడుతూ.. ‘‘బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్నామ‌ని.. డైరెక్ట‌ర్ అయాన్‌ ముఖర్జీ మ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు.. అని మూడేళ్ల క్రితం కరణ్‌జోహార్‌ నాకు ఫోన్‌ చేసి చెప్పారు.

నేను ఓకే అనడంతో అయాన్‌ హైదరాబాద్‌ వచ్చి నన్ను కలిశారు. అయాన్‌తో మాట్లాడినప్పుడు సినిమా పట్ల అతడికున్న ప్రేమ చూసి.. ‘ఇతనెవరో నాకంటే పిచ్చోడులా ఉన్నాడు’ అనుకున్నా. ఎందుకంటే అతడికి సినిమాపై నాకంటే ఎక్కువ ఇష్టం ఉంది. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ గురించి సీరియస్‌గా ఆలోచించాను. అయాన్‌ ఒక బ్రహ్మాండాన్ని క్రియేట్‌ చేస్తున్నారని అర్థమైంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌లో నేను కూడా భాగం కావాలని నిర్ణయించుకున్నాను. దక్షిణాది భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ని సమర్పిస్తున్నాను’’ అని చెప్పాడు.