శేష్‌కు పెళ్లి చేసుకోవాలనిపిస్తోందట

టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు అడివి శేష్. బేసిగ్గా మంచి అందగాడే కాదు.. ఎంతో తెలివైనవాడిగానూ అతడికి పేరుంది. అతడి అందానికి ఎప్పుడో అమ్మాయిలు పడిపోయారు. క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో స్క్రీన్ రైటర్‌గానూ చాలా మంచి పేరు తెచ్చుకుని టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడతను. ఐతే 36 ఏళ్ల వయసొచ్చినా శేష్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. సినిమాలే జీవితం అంటూ గడిపేస్తున్నాడు.

మరి ఇంట్లో పెళ్లి కోసం తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి లేదా అని శుక్రవారమే 36వ పుట్టిన రోజు చేసుకుంటున్న శేష్‌ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘‘ప్రస్తుతానికి నేను పనినే ప్రేమిస్తున్నా. మా ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి ఎప్పుడో అడిగారు. కొన్నాళ్ల తర్వాత తిట్టారు. తర్వాత ఇక లాభం లేదనుకుని వదిలేశారు. ఐతే ఈ మధ్యే మనకంటూ వ్యక్తిగత జీవితం ఉండాలి కదా అనిపిస్తోంది’’ అని శేష్ చెప్పాడు. ఈ మాటను బట్టి శేష్‌కు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగినట్లే కనిపిస్తోంది. కాబట్టి ఆసక్తి ఉన్న అమ్మాయిలు ప్రయత్నించవచ్చేమో.

ఇక తన కొత్త చిత్రం ‘మేజర్’ గురించి చెబుతూ.. మార్కెట్ పెంచుకోవాలనో, పాన్ ఇండియా సినిమా చేయాలనో ఈ చిత్రం చేయలేదని.. మేజర్ సందీప్ కథను నిజాయితీగా, ఎక్కువమందికి చేరువయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశామని శేష్ తెలిపాడు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసి హిందీలో అనువాదం చేయట్లేదని.. రెండు భాషల్లోనూ ఆయా ప్రాంతాల ఎమోషన్లకు తగ్గట్లు ప్రత్యేకంగా స్క్రిప్టు రాసుకుని వేర్వేరుగా తెరకెక్కించామని శేష్ తెలిపాడు. మహేష్ బాబు పేరు తొలిసారి వేరే హీరో సినిమా పోస్టర్ మీద కనిపించబోతోందని, ఆయన పేరు నిలబెట్టేలా సినిమా ఉంటుందని.. ఐతే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో మహేష్ అన్నట్లు ఈ సినిమా గురించి తామిద్దరం మాట్లాడుకున్నది చాలా తక్కువ అని శేష్ తెలిపాడు.