ఆ స‌భ‌కు వెళ్ల‌ని ప‌వ‌న్.. అందుకేనా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా నిలిచిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మానికి కూడా అండ‌గా ఉంటార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. తిరుప‌తిలో పాద‌యాత్ర ముగించిన రైతులు.. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. దీనికి హాజ‌రు కావాల్సిందిగా ప‌వ‌న్‌కు క‌లిసి ఆహ్వానించారు. అందుకు ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డంతో స‌భ‌కు వ‌స్తార‌నే అనుకున్నారు. కానీ ఈ రోజు జ‌రిగే ఆ స‌భ‌కు ప‌వ‌న్ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ‌కు ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఈ అమ‌రావ‌తి పాద‌యాత్ర, స‌భ వెన‌క టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉన్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ  స‌భ‌కు ఆయ‌న‌తో పాటు బీజేపీ నేత‌లు కూడా హాజ‌ర‌వుతున్నారు.

ప‌వ‌న్ కూడా వ‌స్తే బాగుండేద‌ని బాబు భావించారంటా. కానీ ఈ స‌భ వెళ్లి అమ‌రావ‌తి రాజ‌ధానికి సంఘీభావం ప్ర‌కటిస్తే మిగ‌తా ప్రాంతాల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించిన‌ట్లు స‌మాచారం. అందుకే ఈ స‌భ‌కు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డ‌ట్లు తెలిసింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. కానీ దాన్ని వ్య‌తిరేకిస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీతో ప‌వ‌న్ మ‌ళ్లీ పొత్తు పెట్టుకున్నారు.

కానీ ఇప్పుడు ఆయ‌న ఆలోచ‌న మారిన‌ట్లు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో మెరుగైన ఫ‌లితాలు సాధించే దిశ‌గా పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై ప‌వ‌న్ దృష్టి సారించారు. ఈ స‌మ‌యంలో అమ‌రావ‌తికి జై కొట్టి విశాఖ‌, క‌ర్నూలు ప్ర‌జ‌ల దృష్టిలో ఎందుకు విల‌న్ కావ‌డం అని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు తెలిసింది. అందుకే ఈ స‌భ‌కు తాను హాజ‌రు కాకుండా పార్టీ త‌ర‌పున పీఎసీ స‌భ్యుడు హ‌రిప్ర‌సాద్‌, తిరుప‌తి ఇంఛార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌ను పంపిస్తున్నారు. మ‌రోవైపు సీపీఎం కూడా ఈ స‌భ‌కు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది.