టికెట్ల రేట్లపై జగన్ సర్కార్ బిగ్ ట్విస్ట్

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

ఏపీలో సినిమా టికెట్లపై రేగిన వివాదం థ్రిల్లర్ సినిమా రేంజ్ లో పూటకో మలుపు తిరుగుతోంది. తాజా టికెట్ల అమ్మకాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునివ్వడంతో థియేటర్ల యజమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. జాయింట్ కలెక్టర్ల దగ్గర తమ రేట్లను పెట్టి అనుమతులు తెచ్చుకుందామనుకన్న ఆలోచనలో థియేటర్ల యజమానులున్నారు. ఈ క్రమంలోనే కోర్టు తీర్పుపై థియేటర్ల యజమానులకు షాకిచ్చేలా ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి క్లారిటీ ఇచ్చారు. కోర్టు తీర్పు ప్రకారం కొన్ని పిటిషన్ వేసిన కొన్ని థియేటర్లకు మాత్రమే కోర్టు తీర్పు వర్తిస్తుందని బాంబు పేల్చింది.

ఆ థియేటర్లు మాత్రమే పాత పద్ధతిలో టికెట్లు అమ్ముకోవచ్చని, మిగతా థియేటర్లకు టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించిన జీవో నెం.35 అమల్లోనే ఉందని చావుకబురు చల్లగా చెప్పారు. అంతేకాదు, ఈ విషయం హైకోర్టు తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొన్నారని కూడా వివరించారు.

ఆ జీవోపై హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, 3 పిటిషన్లకు కలిపి ఒకేసారి విచారణ జరిపి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో 1 థియేటర్, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు మాత్రమే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వర్తిస్తుందని వెల్లడించారు.

కొంతకాలంగా టికెట్ల రేట్ల వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మేము చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలంటూ ప్రభుత్వం జీవో నెం.35 తీసుకువచ్చింది. అయితే, ఆ రేట్లకు టికెట్లు అమ్మితే నిండా మునిగిపోతామంటూ నిర్మాతలు, దర్శకులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ జీవోను హైకోర్టు సింగ్ బెంచ్ కొట్టివేసింది. ఇక, సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలిచ్చింది. టికెట్ల రేట్లను సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ కు పంపించాలని థియేటర్ల యజమానులకు, ఈ వ్యవహారంపై కొత్త కమిటీ వేయాలని ప్రభుత్వానికి డివిజన్ బెంచ్ సూచించింది. అయితే, తాజాగా వచ్చిన క్లారిటీతో తాము కూడా పిటిషన్ వేసి ఉంటే బాగుండేదని థియేటర్ల యజమానులు అనుకుంటున్నారట.