రౌడీ.. ఇలా చిక్కుకుపోయాడేంటి?

‘పెళ్లిచూపులు’తో తొలి విజయాన్నందుకుని, హీరోగా నిలదొక్కుకున్న నాటి నుంచి విజయ్ దేవరకొండ మామూలు స్పీడులో లేడు. చాలా వేగంగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో కెరీర్‌కు మరింత ఊపొచ్చింది. ఆ సినిమా 2017లో విడుదల కాగా.. తర్వాతి రెండున్నరేళ్ల వ్యవధిలో మహానటి (అతిథి పాత్), గీత గోవిందం, నోటా, ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో పలకరించాడతను.

రెండున్నరేళ్లలో ఐదు ఫుల్ లెంగ్త్ సినిమాలు రిలీజయ్యాయంటే విజయ్ చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నట్లే లెక్క. ఐతే అతడి స్పీడుకు ‘లైగర్’ బ్రేకులు వేసేసింది. మామూలుగా పూరి జగన్నాథ్ సైతం చాలా స్పీడుగా సినిమాలు చేసే దర్శకుడే. మూణ్నాలుగు నెలల్లో ఒక సినిమాను లాగించేస్తుంటాడాయన. కరోనా వల్ల ఈ సినిమా కొంత ఆలస్యమైందంటే అర్థం చేసుకోవచ్చు. ఐతే కరోనా గ్యాప్ తర్వాత మిగతా చిత్రాలు చకచకా పూర్తయి విడుదలకు రెడీ అయిపోతున్నాయి. కానీ ‘లైగర్’ సంగతే అయోమయంగా ఉంటోంది.

కరోనా రెండు వేవ్‌లు కలిపినా ఆరు నెలలకు మించి షూటింగ్‌కు బ్రేక్ లేదు. అయినా సరే.. ఈ చిత్రం ఇంకా పూర్తి కాకపోవడం ఆశ్చర్యం. చిత్రీకరణ చివరి దశలో ఉండుంటే వచ్చే ఏడాది ఆగస్టు వరకు రిలీజ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. వచ్చే వేసవికి అనుకున్న సినిమా కాస్తా మరీ ఆగస్టుకు వాయిదా పడటం విజయ్ అభిమానులకు అస్సలు రుచించడం లేదు. పూరి ఉన్నట్లుండి ఇంత స్లో అయిపోయాడేంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా వెల్లో రిలీజ్ చేయాలనుకోవడం, మేకింగ్‌లో నిర్మాణ భాగస్వామి కరణ్ జోహార్ భాగస్వామ్యం తోడవడం వల్లే ఈ ఆలస్యం అంటున్నారు.

బాలీవుడ్లో మేకింగ్ బాగా లేటుగా జరుగుతుంది. షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా చాలా టైం తీసుకుంటారు. ‘లైగర్’లో బాలీవుడ్ వాళ్ల భాగస్వామ్యం వల్లే ఈ ఆలస్యం అని భావిస్తున్నారు. ఐతే కారణాలేవైనప్పటికీ.. కెరీర్లో కీలక సమయంలో ఒక సినిమాకు మూడేళ్ల పాటు విజయ్ అంకితం అయిపోవడం అతడికంత మంచిది కాదు. బాహుబలి లాంటి సినిమాలకైతే అంతంత సమయం వెచ్చించడం ఓకే కానీ.. ‘లైగర్’కు ఇంత టైం పెట్టాల్సిన అవసరం ఉందా.. అందుకు తగ్గ ఫలితం ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.