బన్నీ ఇండియా రికార్డ్ కొట్టబోతున్నాడా?

అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప విడుదలకు ఇంకో రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. బన్నీ ‘అల వైకుంఠపురములో’ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దానికి ముందు నాన్ బాహుబలి హిట్‌గా ఉన్న ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ చేసిన చిత్రం ఇదే. దీంతో ‘పుష్ప’ మొదలైనప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ప్రోమోలు మాస్‌ను ఉర్రూతలూగించేలా ఉండటం.. పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్లవడం సినిమాపై అంచనాలను ఇంకా పెంచాయి. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగులో రిలీజవుతున్న టైర్-1 హీరో సినిమా ఇదే కావడంతో దీనికి హైప్ ఇంకా పెరిగింది. ఈ నెల ఆరంభంలో వచ్చిన ‘అఖండ’తో బాక్సాఫీస్‌లో మంచి వేడి పుట్టడం కూడా ‘పుష్ప’కు కలిసొచ్చిన విషయమే. దీంతో ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ పక్కా అని తేలిపోయింది.

‘పుష్ప’ రిలీజ్ స్కేల్ చూసినా.. ఈ చిత్రానికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసినా 2021లో హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా నిలవడం.. ఓవరాల్ కలెక్షన్లలోనూ రికార్డులు బద్దలు కొట్టడం లాంఛనమే అనిపిస్తోంది. వరల్డ్ వైడ్ ‘పుష్స’ను ఏకంగా 3 వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సగానికి పైగా థియేటర్లలో తెలుగు వెర్షనే రిలీజవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయినా.. అవతల అయినా తెలుగు వెర్షన్‌కు హైప్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. టికెట్లన్నీ సోల్డ్ ఔటే. దీంతో తెలుగు వెర్షన్ అన్ని థియేటర్లలో తొలి రోజు హౌస్ ఫుల్ వసూళ్లతో నడవడం లాంఛనమే. కేవలం తెలుగు వెర్షనే అలవోకగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును టచ్ చేసేలా ఉంది. మిగతా వెర్షన్లన్నీ కలిపి ఇందులో సగం అయినా కలెక్ట్ చేస్తాయని అంచనా వేస్తున్నారు.

కాబట్టి వకీల్ సాబ్, సూర్యవంశీ సినిమాలను మించి ‘పుష్ప’ తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఇక వీకెండ్ అంతా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఫుల్ రన్లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును పక్కాగా అందుకునేలా కనిపిస్తోంది. కాబట్టి ‘సూర్యవంశీ’ని దాటి 2021లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడమూ కష్టం కాకపోవచ్చు.