త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే!

ఏపీలో త్వ‌ర‌లోనే ఇంటింటి స‌ర్వే ప్రారంభించ‌నున్నారు. ప్ర‌భుత్వ‌మే ఈ స‌ర్వేకు ప్రాతినిధ్యం వ‌హించ‌నుంది. ఈ క్ర‌మంలో వ‌లంటీర్లను ప్ర‌ధానంగా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ స‌ర్వే ప్ర‌ధాన ఉద్దేశం మీకు మూడు రాజ‌ధానులు కావాలా? వ‌ద్దా? అన్న అంశంపై ప్ర‌జ‌ల‌ను నేరుగా ప్ర‌బుత్వం వివ‌ర‌ణ తీసుకోనుంది. ప్ర‌స్తుతం మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి చట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది.

రాష్ట్ర హైకోర్టులో కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంది. దీనికి కార‌ణాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల నుంచి పూర్తిస్థాయిలో విచార‌ణ చేసి.. వారి అభిప్రాయాల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటే.. ఎలాంటి న్యాయ‌స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. తిప్పి కొట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ భావిస్తోంది. దీనికి ప్ర‌భుత్వం కూడా ప‌చ్చ‌జెండా ఊపింది. పాల‌న వికేంద్రీక‌ర‌ణ ద్వారా.. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించే అవ‌కాశం ఉంటుంద‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తోంది.

అయితే.. దీనికి న్యాయ‌ప‌రంగా కొన్ని చిక్కులు రావ‌డంతో .. ప్ర‌స్తుతం ఈ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వ‌ర‌లోనే మ‌ళ్లీ చ‌ట్టాలు చేస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌నే నేరుగా ఈ అంశంపై విచారించి.. వారి అభిప్రాయాలు తెల‌సుకోనున్నారు. మొత్తం ఐదు ప్ర‌శ్న‌ల‌తో కూడిన క‌ర‌ప‌త్రాన్ని ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేసి.. త‌మ‌కు మూడు రాజ‌ధానులు కావాలో వ‌ద్దో తేల్చుకునే అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.

అయితే.. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. రాయ‌లసీమ‌లోని నాలుగు జిల్లాలు, ఉత్త‌రాంధ్రలోని మూడు జిల్లాల‌కు ప‌రిమితం చేయాల‌ని.. వైసీపీ భావిస్తోంది. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల ప్ర‌జ‌ల అభిప్రాయాలు తీసుకుందామ‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్ల ద్వారా.. ఈ స‌ర్వే చేయించి.. అనంత‌రం బిల్లును రూపొందించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు ప‌ట్టం క‌ట్టామ‌నే భావ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసుకునేందుకు ప‌క్కా ఆధారాల‌తో కూడా వుప‌యోగ ప‌డుతుంద‌ని.. స‌ర్కారు త‌ల‌పోస్తోంది. అంతేకాదు.. ప్ర‌జలు కోరుకున్న విధంగా పాల‌న అందించేందుకు కూడా ఇది తోడ్ప‌డుతుంద‌ని.. పైగా విప‌క్షాలు చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌ని అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.