హైకోర్టు తరలింపు ఉండదా ?

జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మూడు రాజధానుల కాన్సెప్ట్ లో మార్పులు చోటు చేసుకున్నాయా ? తాజా పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మూడు రాజధానుల కాన్సెప్టు ప్రకారం అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు, వైజాగ్ లో సచివాలయం ఉండాలి. అయితే ఈ కాన్సెప్టును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలతో పాటు అమరావతి జేఏసీ నేతలు కోర్టులో కేసులు వేశారు. ఇపుడా కేసుల విచారణ జరుగుతోంది.

విచారణ మధ్యలోనే ఉండగా ప్రభుత్వం తన ఆలోచన తాత్కాలికంగా ఉపసంహరించుకున్న ట్లు ప్రకటించింది. తొందరలోనే మళ్ళీ మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే అమరావతి ప్రాంతంలోని నేలపాడు గ్రామంలో హైకోర్టు అదనపు భవనం కోసం శంకుస్ధాపన జరిగింది. అంటే ఇపుడున్న హైకోర్టు భవనం అవసరాలకు సరిపోవటం లేదు కాబట్టి అదనపు భవనం అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.

తాజా పరిణామాల వల్ల అదనపు భవనాన్ని రు. 33 కోట్లతో నిర్మించబోతున్నారు. మొత్తం నాలుగు ఫ్లోర్లలో 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో  నిర్మాణాలు ఉండబోతున్నాయి. ఇదంతా చూసిన తర్వాత తొందరలో ప్రభుత్వం ప్రకటించబోయే కాన్సెప్టులో రివర్సులో ఉండబోతోందని అనుమానాలు పెరుగుతున్నాయి. హైకోర్టు తరలింపు ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి హైకోర్టును అమరావతి ప్రాంతంలోనే ఉంచేస్తారు.

కర్నూలులో హైకోర్టుకు బదులుగా అసెంబ్లీని ఏర్పాటు చేస్తారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అంటే కర్నూలుకు కేటాయించిన హైకోర్టును అమరావతిలోనే ఉంచేస్తారు. అమరావతిలో ఉంచిన అసెంబ్లీని కర్నూలుకు మార్చేస్తారన్నమాట. అప్పుడు హైకోర్టు మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరమే జగన్ కు ఉండదు.

ఎలాగూ ఇప్పుడు పక్కా భవనాలు నిర్మించబోతున్నపుడు దీన్ని మళ్ళీ తరలిస్తామన్నా సుప్రింకోర్టులో, కేంద్రం కూడా అంగీకరించే అవకాశాలు తక్కువ. అందుకనే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే మూడు రాజధానుల కాన్సెప్టులో  హైకోర్టు అమరావతిలోనే కంటిన్యు  అవుతుందని అనిపిస్తోంది.  ఏదేమైనా జగన్ ఉన్నంతవరకు మూడు రాజధానుల కాన్సెప్టు నుండి మాత్రం వెనక్కు తగ్గేట్లు కనబడటం లేదు.