సినిమా టికెట్ రేట్లపై హైకోర్టు సంచలన తీర్పు

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు కుదేలైన సినీ రంగంపై టికెట్ల ధరల తగ్గింపు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పలువురు సినీ ప్రముఖులు చెప్పినా…ఏపీ ప్రభుత్వం మాత్రం రేట్లను తగ్గిస్తూ ఇటీవలే జీవో నం.35ను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆ జీవోను సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…ఆ జీవోను కొట్టివేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. టికెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని వాదనలు వినిపించారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది. అంతేకాదు, పాత విధానంలోనే టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ల యజమానులకు కల్పించింది. దీంతో ఇక పై ఏపీలోని సినిమా థియేటర్లలో టికెట్లకున్న పాత రేట్లే అమల్లోకి వస్తాయి. కాగా పుష్ప, RRR సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలపై ఆంక్షలు, టికెట్‌ రేట్ల తగ్గింపు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు, దర్శకులు, సినీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపారు. అయితే, ఆన్‌లైన్‌ టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తున్న సినీ ఇండస్ట్రీ…రేట్ల తగ్గింపుపై మాత్రం పెదవి విరుస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో సినీ పరిశ్రమకు ఊరట లభించినట్లయింది.