MLC Election: TRS క్లీన్ స్వీప్‌..!

తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఈ ఫలితాల్లో విజయఢంకా మోగించింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ టీఆర్ ఎస్‌ గెలుపొందింది. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్లోని రెండు స్థానాలు గులాబీ వశమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒక స్థానం ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

భారీగా ఓట్లు..

ఖమ్మంలో కీల‌కంగా మారిన‌ తాతా మధు ఎన్నిక చివ‌ర‌కు విజ‌యం సాధించింది. మ‌ధుకు 480 ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌కు 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పోలయ్యాయి. మెదక్‌లోనూ టీఆర్ ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి విజయఢంకా మోగించారు. టీఆర్ ఎస్‌ 762, కాంగ్రెస్ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మం, మెదక్‌ రెండో చోట్ల మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్‌కు నిరాశ తప్పలేదు. రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 జిల్లాల్లో 6 స్థానాలకు ఈ నెల 10న పోలింగ్‌ జరిగింది.

న‌ల్లగొండ‌లో అదేదూకుడు

నల్ల‌గొండ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ ఎస్ మునుప‌టి ఉత్తేజంతోనే దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది.  691 ఓట్ల మెజార్టీతో ఎంసీ కోటిరెడ్డి(టీఆర్ ఎస్‌) గెలుపొందారు. టీఆర్ ఎస్‌ 917, స్వతంత్రులు నగేశ్ 226, లక్ష్మయ్య 26, స్వతంత్రులు వెంకటేశ్వర్లు 6, రామ్‌సింగ్ 5 ఓట్లు పోలయ్యాయి. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో 50 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ ఎస్‌ కైవసం చేసుకుంది. 667 ఓట్ల మెజార్టీతో టీఆర్ ఎస్‌ అభ్యర్థి దండే విఠల్ గెలుపొందారు.

క‌రీంన‌గ‌ర్‌లో.. బీజేపీకి షాక్‌

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ ఎస్ నేత‌లు బీజేపీకి షాకిచ్చారు. ఇక్కడ తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఊసు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. టీఆర్ ఎస్‌ గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణ విజయం సాధించారు. భానుప్రసాద్‌ 584, ఎల్.రమణ 479 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికార టీఆర్ ఎస్‌లో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి.