టీడీపీలో ప్రక్షాళన మొదలైనట్లేనా ?

చాలా రోజులుగా హెచ్చరిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటానికి ప్రధాన కారణం పార్టీలోని కోవర్టులు, వెన్నుపోటుదారులే అని వివిధ సమీక్షల్లో తేలింది. దాంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి సమీక్షపై చంద్రబాబు బాగా సీరియస్ అయ్యారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నవారిని, కోవర్టులను ఏరి పారేస్తానని, పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు.

మామూలుగా అయితే చంద్రబాబుకు ఇలాంటి హెచ్చరికలు చేయడం తర్వాత పట్టించుకోకపోవటం మామూలే. కానీ తాజాగా నెల్లూరు మున్సిపల్  కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్లోని 54 డివిజన్లకు మొత్తం 54 చోట్లా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీనిపై చంద్రబాబు బాగా మండిపోతున్నారు. ఇదే విషయమై నేతలతో మాట్లాడుతూ తీవ్రంగా మండిపోయారు.

ఇందులో భాగంగానే కోవర్టుగా ఆరోపణలు ఎదుర్కొంటు ఫలితాల తర్వాత నిర్ధారణ అయిన రాష్ట్ర కార్యదర్శులు కిలారు వెంకటస్వామి నాయుడు, వేలూరు రంగారావు, పమిడి రవికుమార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. 54 పార్టీ డివిజన్ కమిటీలను రద్దుచేశారు. కోవర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ నేతలను పని తీరు మార్చుకోమని గట్టిగా చెప్పారు. నెల్లూరు నగరంలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసల రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

నెల్లూరు పార్టీ నేతల్లో తొందరలోనే మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అలాగే ఇతర సమీక్షల్లో కూడా కొందరిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన దగ్గర నుండి నేతలను సస్పెండ్ చేయడం అన్నది దాదాపు లేదనే చెప్పాలి.  కాకపోతే తన సహజ స్వభావానికి భిన్నంగా ఇపుడు మాత్రం నెల్లూరులోని ముగ్గురు నేతలను సస్పెండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.