జ‌గ‌న్ స్పందించ‌క‌పోతే.. 3 వేల కోట్లు ఫట్

అన్ని విష‌యాల్లోనూ యాక్టివ్‌గా ఉండే ఏపీ ప్ర‌భుత్వం.. కీల‌క విష‌యంలో అనుస‌రిస్తున్న ఉదాసీన వైఖ‌రి కార‌ణంగా.. దాదాపు 3 వేల కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇది నిజ‌మా? అంటే.. కేంద్ర ప్ర‌భుత్వ‌మే తాజాగా హెచ్చ‌రించ‌డంతో.. ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జల జీవన మిషన్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం కింద ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం రూ.3000 కోట్లు కేటాయించింది.

ఈ ప‌థ‌కంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి నీరు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తి నిధులను భ‌రించాలి. అయితే.. రాష్ట్ర వాటాను ఏపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా సమకూర్చలేదు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధుల నుంచి ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం.. రాష్ట్రానికి రూ. 372.64 కోట్లు కేటాయించి విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 121.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.790.48 కోట్లు కేటాయించగా.. వాటిలో కేవలం రూ. 297.62 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా రూ. 3180 2.88 కోట్లు కేటాయించగా.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేకపోయింది. 2019-20, 2020-21 సంవత్సరానికి గాను కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 453.66 కోట్ల రూపాయలను ఇంతవరకు ఇవ్వలేదు.

2022 మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తే… నిబంధనల ప్రకారం రాష్ట్రానికి జల జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం కేటాయించిన 3,183 కోట్ల రూపాయలు మురిగిపోతాయి. ఒక‌వైపు అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం వివిధ ప‌థ‌కాల కింద ఇస్తున్న నిధుల‌ను తీసుకోవ‌డంలో చేస్తున్న జాప్యంతో నిధులు మురిగిపోతున్నాయ‌ని.. బీజేపీ నాయ‌కులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ స్పందిస్తే.. 3 వేల కోట్ల రూపాయలు ల‌భిస్తాయి. త‌ద్వారా.. ఏపీలో నీటి కుళాయి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.