పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ టైమ్.. బిగ్ బ్రేక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వ‌ర‌లోనే ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న షెడ్యూల్ కూడా ఖ‌రారైన‌ట్టు తెలిసింది. పార్టీలోనూ.. టాలీవుడ్‌లోనూ ఈ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ స‌మ స్య‌పై స్పందించిన ప‌వ‌న్‌.. దీనికి సంబంధించి దీక్ష కూడా చేశారు. అయితే.. ఈ ఏపీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఆయ‌న ర‌ష్యా ఫ్ల‌యిట్ ఎక్కేస్తున్న‌ట్టు తెలిసింది. దీనికి కార‌ణం.. ఆయ‌న కుటుంబ వ్య‌వ‌హార‌మేన‌ని అంటున్నారు పవ‌న్ స‌న్నిహితులు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఏపీలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం కూడా ఆయ‌న ఏపీలోనే ఉంటార‌ని స‌మాచారం.
పార్టీ కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌డంతోపాటు.. ప్ర‌భుత్వంపై చేసే ఉద్య‌మాల‌పై ఆయ‌న పార్టీ నేత‌ల‌కు క్లారిటీ ఇవ్వ‌నున్నారు. అనంత‌రం ఆయ‌న హైద‌రాబాద్‌కు అక్క‌డ నుంచి ర‌ష్యాకు చేరుకుంటార‌ని తెలిసింది. ఇదిలావుంటే.. ప‌వ‌న్ న‌టించిన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతోంది. అలాగే.. ఆయన తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ జనవరిలో తిరిగి ప్రారంభం కాబోతోంది.

ఆల్రెడీ ‘భీమ్లానాయక్’ మూవీలోని తన పార్ట్ కు సంబంధించిన షూట్ ను పూర్తి చేశారు. దీంతో కొంత కొత్త మూవీకి సంబంధించి కొంత గ్యాప్ ఏర్ప‌డ‌నుంది. ఈ గ్యాప్ లో ఆయన రష్యాకి పయనమవుతా రని టాక్. అదేస‌మ‌యంలో కొన్నాళ్ళపాటు రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉండబోతున్నారని అంటున్నారు. పవన్ సతీమణి రష్యన్ అన్నవిష‌యం తెలిసిందే. ఆవిడ కొంతకాలంగా పిల్లలతో రష్యాలోనే ఉంటున్నారు.

కరోనా సెకండ్‌వేవ్ టైమ్ లో ఆవిడ అక్కడకు వెళ్ళారు. క్రిస్మస్ సందర్భంగా పవర్ స్టార్ తన కుటుంబ సభ్యులతో గడ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రష్యా వెళుతున్నారని టాలీవుడ్ క‌థ‌నం. ‘భీమ్లానాయక్’ విడుదలకు కొద్ది రోజులు ఉందనగా పవన్ కళ్యాణ్ ఇండియా తిరిగి వస్తారని సమాచారం. ఈ నెల 20 లోపు రష్యా వెళ్ళి జనవరి ఫస్ట్‌ వీక్ లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు వారాల పాటు రాజకీయాలకు, సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ.. పవన్ ఫ్యామీలీతో గడపబోతున్నారన్నమాట.