తెలంగాణ బీజేపీకి ఇది చావు దెబ్బే

దేశవ్యాప్యంతా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణాలోని బీజేపీపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేకపోయినా సింగరేణి గనులను ఎందుకు ప్రైవేటీకరిస్తోందో కేంద్రమే సమాధానం చెప్పాలి. సింగరేణి పరిధిలోని నాలుగు ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేటీకరించబోతున్నట్లు ఈ మధ్య నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా ప్రభుత్వం+ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వైజాగ్ లోని స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటుపరం చేసేస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ లోని కార్మికులు, ఉద్యోగ సంఘాలతో పాటు పార్టీలు, ప్రజా సంఘాలు దాదాపు నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరెంత ఆందోళనలు చేసినా తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మొండిగా ముందుకే పోతోంది.

సీన్ కట్ చేస్తే ఇపుడు అదే పరిస్థితి తెలంగాణాలోను మొదలైంది. నష్టాలు వస్తున్నాయనో లేకపోతే పెద్దగా లాభాల్లో లేవన్న కారణంతోనో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ మంచి లాభాల్లోనే ఉన్న సింగరేణి బొగ్గు గనులను ఎందుకని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది ? ఈ ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పడం లేదు. తాను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి అమలు కావాల్సిందే అని మొండిగా వాదిస్తోంది.

క్షేత్రస్ధాయిలోని పరిణామాలపై ఆలోచన లేకుండానే కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయమే రాష్ట్రంలోని బీజేపీ పై తీవ్రంగా పడబోతోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగు రోజులుగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇదే విషయమై కేంద్ర నిర్ణయాన్ని తప్పుపడుతూ కేసీయార్ కూడా లేఖ రాశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రైవేటీకరణకు లాభ నష్టాలే ప్రాతిపదిక అయినపుడు సింగరేణి గనులను ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే సింగరేణి మంచి లాభాల్లో ఉంది. ప్రతి ఏడాది వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు బోనస్ కూడా ఇస్తోంది. మరింత లాభాల్లో ఉన్న సంస్ధను కూడా ప్రైవేటుపరం చేసేస్తోందంటే తెరవెనుక ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. అంబానీ, ఆదానీల్లాంటి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న ఆలోచనతోనే నరేంద్రమోడి సర్కార్ ఇలాంటి పనులు చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణా లో వ్యతిరేకత పెరిగిపోతోంది.