టీ కాంగ్రెస్‌లో మరో పార్టీ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి ప్ర‌భావం నుంచి ఇప్పుడిప్ప‌డే బ‌య‌ట‌ప‌డుతోంది. ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జ‌న్మ‌దినం అయిన డిసెంబ‌రు 9 ఇందుకు వేదిక అయింది. ఈ రోజు ఆ పార్టీ డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఘ‌నంగా చేప‌ట్టింది. ఇక్క‌డితో ఆగ‌కుండా ఇక‌పై వ‌చ్చే రెండేళ్లు అదే దూకుడు చూపించాల‌ని డిసైడ్ అయింది. మొద‌ట‌గా తెలంగాణ ఇంటి పార్టీని త‌మ వైపు లాక్కోవాల‌ని చూస్తోంది. ఆ పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కానుంద‌ని స‌మాచారం. ఈ దిశ‌గా ఢిల్లీలో చ‌ర్చ‌లు జ‌రగుతున్నాయి.

పార్టీ అధ్య‌క్షుడు చెరుకు స‌ధాక‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మి, కుమారుడు సుహాస్ కుటుంబం స‌హా కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న చేరిక విష‌యంలో ఏఐసీసీ కీల‌క నేత కొప్పుల రాజు సంధాన క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి పార్టీ అధిష్ఠానం కూడా సుముఖంగా ఉంద‌ని.. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఆయ‌న చేరిక‌ను సుగ‌మం చేసిన‌ట్లు స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈనెల 14న న‌ల్ల‌గొండ‌లో భారీ స‌భ నిర్వ‌హించి పెద్ద ఎత్తున అనుచ‌ర‌గ‌ణంతో కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన చెరుకు సుధాక‌ర్‌కి ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. డాక్ట‌ర్‌గా హైద‌రాబాద్‌, న‌ల్ల‌గొండ జిల్లాల్లో సేవ‌లు అందించి మంచి గుర్తింపు పొందారు.

విద్యార్థి ద‌శ నుండే నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత‌ కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో పీడీ యాక్ట్ కింద అరెస్టు అయి ఏడాది పాటు జైలు జీవితం గ‌డిపారు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ తో విభేదించి సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేశారు. చెరుకు సుధాకర్ 2021లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో అధికార పార్టీని ఢీకొట్టేందుకు త‌న వేదిక స‌రిపోద‌ని భావించి జాతీయ పార్టీలో విలీనానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయ‌కుల ప్ర‌మేయం లేకుండానే ఈ ప్ర‌క్రియ సాగుతున్న‌ట్లు స‌మాచారం.

ఈటెల రాజేంద‌ర్‌, విఠ‌ల్‌, మ‌ల్ల‌న్న లాంటి తెలంగాణ ఉద్య‌మ‌కారులు.. జ‌ర్న‌లిస్టులు బీజేపీలో చేరితే, సుధాక‌ర్ మాత్రం కాంగ్రెస్ వైపు చూశారు. ఈయ‌న విష‌యంలో రేవంత్‌రెడ్డి చురుగ్గా స్పందించిన‌ట్లు తెలిసింది. ఈసారి బీజేపీకి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఒక ముంద‌డుగు వేసి ఢిల్లీ స్థాయిలో డీల్ కుదిర్చిన‌ట్లు స‌మాచారం. 2018 ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన‌ చిరుమ‌ర్తి లింగ‌య్య అధికార పార్టీలో చేర‌డంతో ఆ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు చెరుకు స‌ధాక‌ర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్‌ నుంచి గెల‌వాల‌న్న ఆయ‌న ఆశ‌యం నెర‌వేరుతుందా..? కోమ‌టిరెడ్డి వ‌ర్గం స‌హ‌క‌రిస్తుందా.. అని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి.