జగన్ డెడ్ లైన్ దాటిపోయిందే !

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ ప్రక్షాళన వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారమైతే ఈనెల 6వ తేదీకి రెండున్నరేళ్ళవుతుంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్ మాట్లాడుతూ రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మార్చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండున్నరేళ్లు కాకముందు నుండే మంత్రివర్గం ప్రక్షాళనపై పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయింది.

పార్టీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంత్రివర్గం ప్రక్షాళనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇపుడు రెండున్నరేళ్ళయిన సందర్భంగా పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదేమిటంటే మంత్రివర్గంలో మార్పులకు మరో ఆరుమాసాల సమయం ఉందట. కరోనా వైరస్ కారణంగా చాలామంది మంత్రులు పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం దొరకలేదని కొందరు మంత్రులు జగన్ కు చెప్పుకున్నారట. మంత్రుల సామర్థ్యాన్ని పక్కన పెట్టేస్తే కారణమైతే వాస్తవమే.

మంత్రులతో చర్చల సందర్భంగా కరోనా వైరస్ కారణాన్ని జగన్ కూడా అంగీకరించారట. ఇప్పటికిప్పుడు మంత్రులందరినీ మార్చి కొత్త వాళ్ళని తీసుకున్నా సమస్యలు వస్తాయని కూడా మరికొందరు జగన్ తో చెప్పారట. షెడ్యూల్ ఎన్నికలకు గడువు ఉన్నది రెండున్నరేళ్ళే కాబట్టి కొత్తవారు మంత్రులుగా కుదురుకోవటానికి చాలా సమయం పడుతుందని చెప్పారట. ఈలోగా ముందస్తు ఎన్నికలంటే ఇంకా ఇబ్బంది అయిపోతుందని కొందరు జగన్ తో అన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

అందుకనే మధ్యేమార్గంగా మంత్రులందరినీ కాకుండా ఓ పదిమందిని కంటిన్యూ చేసి మిగిలిన వారిని మార్చేస్తే ఆలోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అదికూడా వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాతే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ నెలలో క్రిస్మస్ అయిపోయిన వెంటనే ప్రక్షాళన ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తాజా ప్రకారమైతే మార్చిలోనే ఉంటుందంటున్నారు. ఏదేమైనా మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో జగన్ ఆలోచనలకు ఎప్పటికప్పుడు ఏవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. చివరకు జగన్ ఏమి చేస్తారో ఏమో.