నిఖార్సయిన హిట్టు.. ఇప్పుడైనా?

కొన్నేళ్ల కిందట ‘ఛలో’ సినిమాతో కెరీర్లోనే చాలా పెద్ద హిట్ అందుకున్నాడు నాగశౌర్య. ఆ సినిమాతో అతడి ఫాలోయింగ్ పెరిగింది. మార్కెట్ పెరిగింది. అవకాశాలూ పెరిగాయి. ఓవైపు ‘ఛలో’తో మొదలైన తన సొంత బేనర్ ‘ఐరా క్రియేషన్స్’లో అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తూనే.. బయటి బేనర్లలోనూ నటిస్తున్నాడు శౌర్య. గత మూడేళ్లలోనే అరడజనుకు పైగానే సినిమాలు వచ్చాయి శౌర్య నుంచి. వీటిలో ‘వరుడు కావలెను’ సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు.

‘అశ్వథ్థామ’ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నా.. టాక్ బాగా లేకపోవడంతో నిలబడలేదు. కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల లాంటి సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి హిట్ ఒక్కటీ లేక నాగశౌర్య బాగా ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ‘వరుడు కావలెను’ ఫలితం అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘లక్ష్య’ మీద నాగశౌర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు.

సుమంత్‌తో ‘సుబ్రహ్మణ్య పురం’ తీసిన సంతోష్ జాగర్లమూడి రూపొందించిన చిత్రమిది. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలు తక్కువ కాగా.. ఇప్పటిదాకా ఆర్చరీ నేపథ్యంలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ బ్యాక్‌డ్రాప్‌లోనే ‘లక్ష్య’ తెరకెక్కింది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ పెంచడంతో పాటు శారీరకంగా చాలానే కష్టపడ్డాడు శౌర్య.

ట్రైలర్ చూస్తే మంచి ఎమోషన్లున్న అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామా చూడబోతున్న ఫీలింగ్ కలిగింది. శౌర్య సరసన ‘రొమాంటిక్’ భామ కేతిక శర్మ కథానాయికగా నటించింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. ఐతే ‘అఖండ’ జోరు ఇంకా కొనసాగుతుండగా.. వచ్చే వారం రానున్న ‘పుష్ప’ మీద అందరి ఫోకస్ నిలిచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘లక్ష్య’ ఏమేర సత్తా చాటుతుందో చూడాలి. దీంతో పాటు శ్రియ సినిమా ‘గమనం’ కూడా రిలీజవుతున్నప్పటికీ దానికి అంతగా బజ్ లేదు.