బీజేపీ ఎంపీల‌కు మోడీ వార్నింగ్

ఇటీవ‌ల పార్ల‌మెంటు స‌మావేశాల్లో బీజేపీ ఎంపీల‌కు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బిగ్ వార్నింగ్ ఇచ్చా రంటూ.. మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. పార్ల‌మెంటు స‌భ‌ల‌కు.. బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు హాజ‌రు కావ‌డం లేద‌ని.. ఇలా అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా ద‌క్క‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు  ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మోడీ ఇలాంటి హెచ్చ‌రి క‌లు చేయ‌డం ఇది రెండోసారి. గ‌త ఏడాది కూడా మోడీ ఇలానే ఎంపీల‌ను హెచ్చ‌రించారు. ఇప్పుడు తాజాగా మ‌రింత తీవ్రంగా హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. గ‌తానికి ఇప్ప‌టికి తేడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో మూడు నూత‌న‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో కొన్ని ప్ర‌తిప‌క్షాలు.. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన వారు.. స‌భ‌లో ఆందోళ‌న చేశారు. ఈ క్ర‌మంలో వారి దూకుడుకు.. అధికార ప‌క్షం అడ్డుక‌ట్ట వేయ‌లేక పోయింది. ఈ క్ర‌మంలో స‌భ‌లోనూ బీజేపీ స‌భ్యులు త‌క్కువ‌గా హాజ‌ర‌య్యారు. బీజేపీ స‌భ్యుల బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. స‌భ‌లో స‌భ్యులు లేక‌పోవ‌డ‌తో ప్ర‌తిప‌క్షాన్ని నిలువ‌రించ‌డం క‌ష్ట సాధ్యంగా మారింది. దీంతో అప్ప‌ట్లోనే పార్ల‌మెంటు బీజేపీ స‌భ్యుల‌ను మోడీ హెచ్చ‌రించారు. అయితే.. ఇప్పుడు చేసిన తీవ్రంగా ఆయ‌న అప్ప‌ట్లో హెచ్చ‌రించ‌లేదు.

దీనికి కార‌ణం.. త‌మ స‌భ్యులు స‌భ‌లో లేక‌పోయినా.. ఇత‌ర పార్టీల స‌భ్యులు.. తెర‌చాటు మ‌ద్ద‌తిస్తున్న స‌భ్యులు  చాలా మంది మౌనంగా ఉండిపోవ‌డ‌మే కార‌ణం. అయితే.. ఇప్పుడు మాత్రం.. ఎవ‌రైతే.. త‌మ‌కు ఇంత‌కాలంగా మ‌ద్ద‌తుగా ఉన్నారో.. వారంతా .. ఇప్పుడు యాంటీ అయ్యారు. త‌మ త‌మ రాష్ట్రాల‌కు కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. వారు గ‌ళం విప్పుతున్నారు. దీంతో మోడీ ప్ర‌భుత్వం స‌భ‌ల్లో ఇరుకున‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో చాలా విష‌యాల‌పై చ‌ర్చ‌లు కూడా చేప‌ట్ట‌డం లేదు. నిజానికి రైతు వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో వైసీపీ, టీఆర్ ఎస్, స‌హా.. మ‌మ‌తా బెన‌ర్జీకి చెందిన తృణ‌మూల్ కాంగ్రెస్ కూడా ప‌రోక్షంగా మ‌ద్ద‌తిచ్చాయి.

దీంతో స‌భ‌లో బీజేపీ స‌భ్యుల సంఖ్య త‌గ్గినా.. మోడీపై పెద్ద‌గా ఎఫెక్ట్ ప‌డ‌లేదు. కానీ, ఇప్పుడు.. ఆయా పార్టీలే.. త‌మ త‌మ స‌మ‌స్య‌ల‌తోపాటు.. జాతీయ ప్రాధాన్యం ఉన్న స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల ప‌రిధి పెంపు, పెట్రో ధ‌ర‌ల త‌గ్గింపు.. ధాన్యం సేక‌ర‌ణ వంటి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నాయి. దీంతో దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ స‌భ్యులు స‌భ‌ల్లో ఉండ‌క‌పోవ‌డంతో.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌లు, వారు చేస్తున్న యాంటీ ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చేరుతోంది.

దీనిని ప‌సిగ‌ట్టిన ప్ర‌ధాని.. త‌న స‌భ్యులు స‌భ‌ల్లో ఎక్కువ మంది ఉంటే.. ఇంత వ్య‌తిరేక‌త‌ను కూడా సునాయాశంగా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంపీల‌కు టికెట్ల భ‌యం పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. జాతీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి మోడీ బెదిరింపుల‌ను ఎంత వ‌ర‌కు నేత‌లు అర్ధం చేసుకుంటారో.. లైన్‌లోకి వ‌స్తారో చూడాలి.