వామ్మో ఇదేం స్కీమ్ జగనన్న

వైసీపీ పాలనలో నిర్మాణ రంగం బాగా దెబ్బతిందని, కాంట్రాక్టర్లకు, బిల్లర్లకు బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే కొత్తగా ఏవైనా నిర్మాణాల కోసం ప్రభుత్వం టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది.

ఇక నుంచి పట్టణ ప్రాంతాల్లో రాబోయే లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని సదరు జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని షాకింగ్ ఉత్తర్వులను జారీచేసింది. ఒకవేళ అలా ఇవ్వకుంటే…లేఅవుట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో 5 శాతం భూమిని కొని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు ఆప్షన్లను వద్దనుకుంటే ఆ 5 శాతం స్థలం విలువకు సమానమైన మొత్తాన్ని కలెక్టర్ కు చెల్లించాలని మూడో ఆప్షన్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై రియల్టర్లు, బిల్డర్లు, లే అవుట్లు వేసేవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులతో మేము ప్రైవేటు ప్రాపర్టీలో వెంచర్ వేసుకుంటే ప్రభుత్వానికి స్థలం ఇవ్వడమేమిటని పలువురు రియల్టర్లు షాక్ అవుతున్నారు. ఇది కేవలం ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న పని అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు, సకాలంలో బిల్లులు రాక తీవ్రంగా నష్ట పోయామని, ఇకపై లే అవుట్లు వేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

చాలా కాలం నుంచే లే అవుట్లో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు వదిలేయాలనే రూల్ ఉంది. తాజా ఉత్తర్వులతో అద 15 శాతానికి పెరిగింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 5 ఎకరాల్లోపు లేఅవుట్లకు 47.50 శాతం, 5 ఎకరాల పైబడిన లేఅవుట్లకు 49 శాతం భూమిని అదనంగా బిల్డర్లు, రియల్టర్లు వదులుకోవాల్సి ఉంటుంది. అయితే, బిల్లర్లు, రియల్టర్లపై పడుతోన్న అదనపు భారం ఫ్లాట్లు కొనేవారిపైనే పడుతుందని అంటున్నారు. ఇకపై ఫ్లాట్లు కొనేవారికి తిప్పలు తప్పవని అనుకుంటున్నారు. లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీ ఖజానాను భర్తీ చేసేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.