జయ ఆస్తులు తీసుకుంటే సరిపోదు: IT ట్విస్ట్

తమిళనాడు హైకోర్టు దివంగత ముఖ్యమంత్రి మేనల్లుడు, మేనకోడలు విషయంలో విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. తమ మేనత్త ఆస్తులు తమకే రావాలని పట్టుబట్టిన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలకు హైకోర్టు ఒక విధంగా షాకి ఇచ్చింది. ఆస్తులే కాదు బకాయిలు కూడా వారసులు తీర్చాల్సిందే అని తాజాగా తీర్పిచ్చింది. జయలలిత మరణించిన తర్వాత ఆమె పేరుతో ఉన్న ఆస్తులపై పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆమెకున్న ఆస్తులు ఎన్ని అనే విషయంలో ఎవరకీ సరైన సమాచారం లేదు. జయతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం కారణంగా ఆమె ఆస్తుల విషయం శశికళకు తెలిసుంటుందని అందరు అనుకుంటున్నారు.

అయితే జయ ఆస్తుల విషయమై శశికళ కూడా ఇప్పటివరకు ఎక్కడా నోరిప్పలేదు. దాంతో చెన్నైలోని పొయెస్ గార్డెన్లో జయ ఉన్న ఇల్లు వేదనిలయం లాంటివి ఒకటిరెండు ఆస్తులు తప్ప ఇంకేమీ కనిపించటంలేదు. అయితే జయ మరణం తర్వాత ఊటిలో ఓ ఫామ్ హౌస్ ఉందని, కొడనాడులో టీ ఎస్టేట్ ఉందనే విషయాలు బయటపడ్డాయి. మొత్తం మీద ఆస్తుల వ్యవహారం ఇంకా వివాదాస్పదంగాను, సీక్రెట్ గానే ఉండిపోయాయి. ఈ నేధ్యంలోనే వేదనిలయాన్ని సొంతం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు చేశారు. దాంతొ ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ మధ్య  ఆస్తుల కోసం వివాదం మొదలైంది.

చివరకు వీళ్ళ మధ్య వివాదం కోర్టుకు చేరటంతో సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. జయలలిత ఆస్తులు, అప్పులపై ఎలాంటి విల్లు రాయలేదు కాబట్టి  జయలలితకు మేనల్లుడు, మేనకోడలే చట్టబద్దమైన వారసులుగా హైకోర్టు గుర్తించింది. వెంటనే వేదనిలయం ఇంటితో పాటు జయ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపల సొంతం చేయాలంటు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆమె ఆస్తులన్నీ దీప, దీపక్ సొంతమైపోయాయి. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా వీళ్ళద్దరిపైన హైకోర్టు పెద్ద పిడుగు పడేసింది. ఆస్తులు తీసుకోవటమే కాదని జయలలిత కట్టాల్సిన బకాయిలను కూడా మీరే కట్టాలంటు గట్టి షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖకు జయలలిత కట్టాల్సిన బకాయిలను మేనల్లుడు, మేనకోడలు దగ్గర నుండే రాబట్టుకోవాలని ఐటీ శాఖను హైకోర్టు ఆదేశించింది.

ఇపుడు జయలలిత ఆస్తుల విలువెంత, ఐటి శాఖకు చెల్లించాల్సిన బకాయిలెంత అనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. మార్కెట్ రేట్ల ప్రకారం వీళ్ళకు దక్కిన ఆస్తుల విలువ ఎంతైనా ఉండచ్చు. కానీ జయలలిత ఐటి శాఖకు కట్టాల్సిన బకాయిలే కోట్ల రూపాయలుంటుందని సమాచారం. అంటే మేనత్త జయలలిత కట్టాల్సిన బకాయిలను వీళ్ళిద్దరు చెల్లించాలంటే నిజానికి వీళ్ళకి అంత స్తోమత లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే మేనల్లుడు, మేనకోడల నేపధ్యం చాలామందికి తెలీదు. ఎంతటి ఆస్తిపరులైనా కోట్ల రూపాయల్లో ఐటి బకాయిలు చెల్లించేంత అయితే ఉండదనే అనుకుంటున్నారు.

ఇపుడు ఐటి శాఖకు బకాయిలు చెల్లించాలంటే చేతిలో ఉన్న ఆస్తులను అమ్ముకోక తప్పేట్లు లేదు. మేనత్త వారసులుగా తమకు అయాచితంగా వచ్చిపడిన ఆస్తులను హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చని వీళ్ళద్దరు అనుకునుండచ్చు. అయితే హఠాత్తుగా సీన్ రివర్సయిపోయింది. ఒకవైపు లెక్కలో ఉన్న ఆస్తులను మాత్రమే కాదని బినామీపేర్లతో కూడా తమ మేనత్త చాలా ఆస్తులను పోగేసినట్లు వీళ్ళు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇదే పద్దతిలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జయలలిత సంపాదించినట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇపుడు వాటి సంగతి దేవుడెరుగు ముందు ఐటి శాఖకు కట్టాల్సిన కోట్ల రూపాయల బకాయిలు ఎలా చెల్లించాలో తెలీక వీళ్ళద్దరు లబో దిబో అంటున్నారు.