హిందూ మ‌తాన్ని స్వీక‌రించిన ముస్లిం నేత‌

మీరు చ‌దివింది నిజ‌మే!  నిన్న మొన్న‌టి వ‌ర‌కు ముస్లింగా జీవించిన వ్య‌క్తి, జీవించ‌డ‌మే కాదు.. షియా వ‌క్ఫ్ బోర్డుకు నాయ‌కత్వం వ‌హించిన వ్య‌క్తి.. అనూహ్యంగా హిందూ ధ‌ర్మాన్ని అంగీక‌రించ‌డం.. హిందువుగా మార‌డం.. న‌మ్మ‌లేని నిజం! సాధార‌ణంగా హిందువులు.. ఇత‌ర మ‌తాల‌ను స్వీక‌రించిన చ‌రిత్ర‌.. ప్ర‌స్తుత కాలంలోనూ జ‌రుగుతున్న ప‌రిణామాలు మ‌న‌కు తెలుసు. అయితే.. అనూహ్యంగా ఒక ముస్లిం పెద్ద‌.. ఇప్పుడు హిందువుగా మారారు. పూజ‌లు, హోమాలు చేశారు. హిందూ పెద్ద‌ల స‌మ‌క్షంలో త‌న పేరును కూడా మార్చుకున్నారు.

ఎవ‌రు…?  ఎక్క‌డ‌…?

ఉత్తర్ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్, ముస్లిం నేత సయ్యద్ వసీమ్ రిజ్వీ ఇస్లాంను వదిలి.. హిందూ మతాన్ని స్వీకరించా రు. గాజియాబాద్లోని డాసనా దేవి ఆలయంలో నరసింహానంద సరస్వతి మహారాజ్ ఆధ్వర్యంలో హైందవ సంప్రదాయ పద్ధతు ల్లో హిందువుగా మారారు. తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగీగా మార్చుకున్నారు.  ఆలయంలో సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత హిందువుగా నామకరణం చేసినట్లు యతి నరసింహానంద సరస్వతి చెప్పారు. త్యాగీ వర్గం ప్రజలు సమావేశమై చర్చించుకున్న తర్వాతే జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగీ పేరును ఎంపిక చేసినట్లు చెప్పారు. త్యాగీ తన సోదరుడని, ఇప్పటి నుంచి తన తండ్రికి ఇద్దరు కుమారులని తెలిపారు. చాలా సంతోషంగా ఉందన్నారు.

ఎందుకు మారారు?
డాసనా దేవి ఆలయంలో కార్యక్రమాల అనంతరం రిజ్వీ మాట్లాడారు. తనను కొందరు ఇస్లాం నుంచి వెళ్లగొట్టినట్లు చెప్పారు. “ఇస్లాం నుంచి బయటకు పంపించాక ఏ మతం తీసుకోవాలనేది నా ఇష్టం. ప్రపంచంలో సనాతన ధర్మమే తొలి మతం. అందులో ధర్మం, మానవత్వం ఉంది. అది ఏ మతంలోనూ లేదని నేను నమ్ముతున్నా“ అన్నారు. ఇదిలావుంటే, హిందూ మతం స్వీకరించాలనుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం ఓ వీడియో ద్వారా రిజ్వీ సందేశం ఇచ్చారు.

`చివ‌రి` కోరిక ఇదీ..
తన మరణానంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ఖననం చేయొద్దని రిజ్వీ కోరారు. తన పార్థివ దేహాన్ని హిందూ స్నేహితుడు, మహంత్ నరసింహానంద సరస్వతికి అప్పగించాలని సూచించారు. ఆయనే తన చితికి నిప్పు పెట్టాలనే తన కోరికను వెల్లడించారు. కొంత మంది తనను చంపాలనుకుంటున్నారని, మరణానంతరం తన శరీరాన్ని ముస్లిం స్మశానంలోకి అనుమతించమని చెబుతున్నారని తెలిపారు.

ఖురాన్ మార్పుతో.. మొద‌లైన మార్పు!!
ఖురాన్లోని 26 వాక్యాలను తొలగించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసిన క్రమంలో రిజ్వీ ముస్లింల ఆగ్రహానికి లోనయ్యారు. వీటిని హజ్రత్ అబూ బకర్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్ తొలి ఖలీఫా ఖురాన్లోకి చొప్పించారని, జిహాద్ను ప్రోత్సహించేందుకు ఉగ్రవాదులు వీటిని ఉపయోగిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ 26 వాక్యాలను తొలగించి సరికొత్త ఖురాన్ను సిద్ధం చేసినట్లు చెప్పారు రిజ్వీ. ఒక కాపీని ప్రధాని మోడీకి పంపించినట్లు చెప్పారు. మదర్సాలు, ముస్లిం విద్యా సంస్థల్లో కొత్త ఖురాన్ ఉపయోగించేలా చూడాలని  తెలిపారు. దీంతో అప్ప‌టి నుంచి ముస్లింలు రిజ్వీని దూరం పెట్టారు.