ఆర్ ఆర్ ఆర్‌ పై వైసీపీ క‌త్తి!

లోక్‌సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ‌రాజును వైసీపీ ఎంపీలు.. తీవ్రంగా టార్గెట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆర్ ఆర్ ఆర్ కు మధ్య పెద్ద వారే జరిగింది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాటల యుద్ధం చేశారు.

జీరో అవర్‌లో ఏపీలో జ‌రుగుతున్న అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర విష‌యాన్ని ర‌ఘురామ లేవ‌నెత్తారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని రైతులు రెండేళ్లుగా చేస్తున్న ఉద్య‌మాన్ని వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొన్నాళ్లుగా రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పించడాన్ని తప్పు పట్టారు. ఈ విష‌యాన్ని లోక్‌స‌భ దృష్టి కి తెచ్చారు.

గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమని రఘురామ పేర్కొన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.

అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ క్షీణించాయన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారన్నారు. ఇప్ప‌టికే.. ఎస్సీ క‌మిష‌న్‌, హైకోర్టు సైతం.. రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఉన్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. రఘురామ ప్రసంగాన్ని వైసీపి ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్ర‌మంలో రఘురామ వ్యాఖ్యలను వైసీపీ లోక్‌సభా పక్ష నేత మిధున్ రెడ్డి ఖండించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిధున్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే.. తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయని… సీఎం జగన్‌ పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్ర‌తిగా మిథున్‌రెడ్డి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ‌వేసిన కేసులో ఒక బ్యాంకు అధికారులు ఏకంగా ఎంపీ ఇంటి ముందు ధ‌ర్నా చేశార‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.