కేసీఆర్‌కు ఆ ఎన్నిక‌ల భ‌యం?

ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో విజ‌యంతో కేసీఆర్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత రాష్ట్రంలో జ‌రిగిన దాదాపు ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌కే విజ‌యాలు ద‌క్కాయి. ఇక 2018లో ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం కేసీఆర్ సొంత‌మైంది. దీంతో రాష్ట్రంలో త‌న‌కు త‌న పార్టీకి తిరుగులేద‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ గ‌త రెండేళ్లుగా ప‌రిస్థితి తారుమారైంది. ఒక‌ప్పుడు ఎలాంటి ఎన్నిక అయినా భ‌యం లేకుండా సాగిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కూ భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీఆర్ఎస్ దాదాపు అన్ని ఎన్నిక‌లు ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధించింది. కానీ రెండోసారి గెలిచిన త‌ర్వాత మాత్రం ఆ పార్టీ ఆధిప‌త్యం త‌గ్గుతూ వ‌స్తోంది. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌లంగా పుంజుకోవ‌డం అందుకు కార‌ణం. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మితో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు చావుత‌ప్పి క‌న్ను లొట్ట‌బోయింద‌నే ప‌రిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఎన్ని వ్యూహాలు వేసినా.. ఎంత ఖ‌ర్చు పెట్టినా హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ గెలుపును అడ్డుకోలేక‌పోవ‌డంతో కేసీఆర్‌లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంద‌ని స‌మాచారం. అందుకే ఆయ‌న వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకుని అందుకు త‌గ్గ‌ట్లుగా వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని తెలుస్తోంది.

పార్టీ నేత‌ల్లో ప్ర‌జా ప్ర‌తినిధుల్లో కార్య‌క‌ర్తల్లో ఉన్న అసంతృప్తిని త‌గ్గించేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌కు డిసెంబ‌ర్ 10న పోలింగ్ జ‌రుగుతుంది. ఆయా స్థానాల్లో చూసుకుంటే టీఆర్ఎస్‌కు 70 శాతం మంది వ‌ర‌కూ ఓట‌ర్లున్నారు. కానీ పార్టీపై అసంతృప్తి కార‌ణంగా వాళ్లు అనుకూలంగా ఓట్లు వేస్తారో లేదో అన్న భ‌యం కేసీఆర్‌లో క‌లుగుతుంద‌ని టాక్‌. ఎందుకంటే సొంత పార్టీ క్యాడ‌రే అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచిన వాళ్ల‌ను ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో వాళ్లు ఆర్థికంగా చితికిపోవ‌డంతో పాటు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో త‌మ స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను టీఆర్ఎస్ ఇప్ప‌టికే క్యాంపుల‌కు త‌ర‌లించింది. వాళ్లు మ‌రో పార్టీ వైపు చూడ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక తాజాగా చేయించిన ప‌నుల‌క బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్న ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల కోసం నిధులు కేటాయించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించార‌ని తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక స‌మీక్ష జ‌రిపిన ఆయ‌న‌.. జిల్లా, మండ‌ల ప‌రిష‌త్‌ల అభివృద్ధికి త‌క్ష‌ణ‌మే రూ.250 కోట్లు విడుద‌ల చేయాల‌ని పంచాయ‌తీ రాజ్ మంత్రి ఎర్ర‌బెల్లిని ఆదేశించార‌ని తెలిసింది. ఈ ప్ర‌కారం చూస్తే కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల భ‌యం ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు అర్థ‌మవుతోంది. ఒక్క స్థానాన్ని చేజార్చుకున్నా గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు త‌మ ప్ర‌జా ప్ర‌తినిధులు కూల్ చేసేందుకే ఈ నిధుల ఆదేశాల‌ని..  ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ప‌ట్టించుకోర‌ని టీఆర్ఎస్ నేత‌లే అనుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.