సాలార్ సీన్స్ మళ్లీ తీస్తున్నారా?

రీషూట్ అనే మాట వింటే ప్రభాస్ ఫ్యాన్స్ ఉలిక్కిపడుతున్నారు. దానికి కారణం ‘రాధేశ్యామ్’. 2018లో మొదలైన ఈ సినిమా 2022కి గానీ రిలీజ్ కావడం లేదు. ఇంత టైమ్ పట్టడానికి కారణం రీషూట్‌ అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కరోనా కారణంగా అయిన ఆలస్యాన్ని పక్కనబెడితే.. మిగతా సమయమంతా రీషూట్‌కే పట్టిందనే టాక్ ఉంది. ఒకటీ రెండూ కాదు.. సినిమాలో చాలా సీన్స్ని రీషూట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ‘సాలార్‌‌’ విషయంలోనూ రీషూట్ అనే మాట వినిపిస్తూ ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. 

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కాస్త త్వరగానే పట్టాలెక్కించేశారు. 2020 డిసెంబర్‌‌లో అనౌన్స్ చేసి, 2021 జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసేశారు. చిత్రీకరణ కూడా వేగంగానే కానిచ్చారు. 2022 ఏప్రిల్ 14న సినిమాని రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించేశారు. షూటింగ్ జరుగుతున్న స్పీడ్‌ని బట్టి అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం గ్యారంటీ అని ఫిక్సయ్యారంతా. అయితే ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ని మళ్లీ తీయబోతున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. 

సాలార్‌‌కి క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మొదట్నుంచీ చెబుతున్నారు మేకర్స్. ఆల్రెడీ ఇంటర్వెల్ సీన్స్ తీసేశారు కూడా. అయితే అవి తాను అనుకున్న స్థాయిలో రాలేదని ప్రశాంత్ నీల్ ఫీలవుతున్నాడట. మరోసారి చిత్రీకరిస్తే మంచిదనుకుంటున్నాడట. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌‌తో సినిమా చేస్తున్నప్పుడు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదనే పట్టుదలతో ఉన్నాడట ప్రశాంత్. అలా అనుకోవడం మంచిదే కానీ ఈ రీషూట్‌ ఇంటర్వెల్‌ సీన్స్‌తో ఆగుతుందా, ఇంకా ముందుకెళ్తుందా అనేదే అందరి భయం.

షూటింగ్ అంతా పూర్తైపోయి, రషెస్ చూసుకున్నప్పుడు ఏదైనా కాస్త అసంతృప్తి ఉంటే రీషూట్ చేస్తారు. అది సహజమే. కానీ షూటింగ్ జరుగుతూ ఉండగానే రీషూట్‌ మోడ్‌లోకి ఎందుకు వెళ్తున్నారు అనేది కొందరి ప్రశ్న. అసలిది నిజమో కాదో తెలియకుండా కంగారుపడటం ఎందుకు అనేది మరికొందరి మాట. అదీ నిజమే. ఈ నెలలో, వచ్చే నెలలో రిలీజవుతున్న సినిమాల పనులే ఇంకా జరుగుతున్నాయి. సాలార్ రావడానికి ఇంకా బోలెడంత టైముంది. ఈలోపు షూట్లు, రీషూట్లు ఏం చేసుకున్నా అది వారి ఇష్టం. దాని గురించి ఇప్పుడే టెన్షన్ పడటం అనవసరం.