కేసీఆర్‌ను మ‌మ‌త‌ను క‌లిపేందుకేనా?

రాబోయే రోజుల్లో దేశ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయ‌నే సంకేతాలు ఇప్ప‌టి నుంచే క‌నిపిస్తున్నాయి. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం మ‌హా రంజుగా సాగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఓ వైపు వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోందనే వ్యాఖ్య‌లు.

మ‌రోవైపు కాంగ్రెస్‌ను ప‌క్క‌న‌పెట్టి మోడీకి వ్య‌తిరేకంగా పోరాడేందుకు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అడుగులు. అందుకు ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ అలియాస్ పీకే సాయం. ఇలా ప్ర‌స్తుత జాతీయ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీకి వ్య‌తిరేకంగా పోరాడాలంటే బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు దేశంలోని ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కావాలి. ఆ మ‌ద్ద‌తు కోసం పీకే సార‌థ్యంలో ఆమె ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. మొన్న‌టి వ‌ర‌కూ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని కూట‌మి బీజేపీకి వ్య‌తిరేకంగా ఏక‌మ‌వుతుంద‌ని అనిపించింది. కానీ ఇప్పుడు పీకేతో పాటు మ‌మ‌త కూడా కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ను కాద‌ని మ‌మ‌త ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌మ‌త‌కు అవ‌స‌ర‌మైన వ్యూహాలు అందిస్తున్న పీకే.. ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్‌ను ఆమెకు ద‌గ్గ‌ర చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త తెలుసుకునేందుకు పీకే సంస్థ ఐ ప్యాక్‌తో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌జ‌ల నాడీ తెలుసుకునేందుకు ఐ ప్యాక్ స‌ర్వే చేయ‌బోతుంది. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. పీకేతో భేటీ అయ్యార‌ని ఆ త‌ర్వాతే ఐ ప్యాక్ ప్ర‌తినిధులు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చార‌ని స‌మాచారం.

గ‌తంలో కేసీఆర్ కూడా జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసేందుకు కాగ్రెస్‌, బీజేపీయేత‌ర మూడో కూట‌మి కోసం ప్ర‌య‌త్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం ఆయ‌న దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల‌ను క‌లిశారు. కానీ గ‌త కొంత‌కాలంగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ కేంద్రం విధానాల‌పై పోరాటం చేస్తున్న కేసీఆర్‌.. మ‌మ‌తా బెన‌ర్జీతో క‌లిసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి.