టాప్ 5: రోశయ్య సత్తా చాటే 5 ఉదంతాలు

మన మధ్య ఉన్నప్పుడు గొప్పతనం తెలీదు. తిరిగి రాని లోకాలకు పయనమైన తర్వాత.. సదరు వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు వారిసత్తా తెలీటమే కాదు.. ఇలాంటి వారు ఇకపై ఉండరేమోనన్న భావన అప్పుడప్పడు కలుగుతుంది. ఎన్ని రంగాలు ఉన్నా.. సామాన్యుడి మొదలు అసమాన్యుడు వరకు అందరిని ప్రభావితం చేసే రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఎవరితో సంబంధం లేకుండా తన మానాన తాను బతికే వ్యక్తి సైతం.. రాజకీయంగా తీసుకునే నిర్ణయాలతో తీవ్రమైన ప్రభావితం అవుతుంటారు. అలాంటి రాజకీయాల్ని చాలామంది విసుక్కుంటారు. చులకనగా చూస్తారు.కానీ.. తెలుగు నేల మీద అలాంటి రాజకీయ రంగంలో కొన్ని ఆణిముత్యాల్లాంటి నేతలు ఉంటారు. అలాంటి వారు పోయిన తర్వాత వారి సత్తా గుర్తుకు వచ్చి.. ఇలాంటి వారు ఇక రారేమో అన్న భావన కలుగుతుంది. అలాంటి నేతల్లో కొణిజేటి రోశయ్య ఒకరని చెప్పక తప్పదు. ఆయన సమర్థత.. సామర్థ్యం ఎంతన్న విషయాన్ని చెప్పే ఐదు అంశాల్ని ఆయన మనందరిని విడిచి పెట్టి వెళ్లిపోయిన వేళ గుర్తు చేసుకోవటం సముచితం.

1. ఆర్థిక మంత్రి అంటే ఆయనే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక మంత్రి పదవికి ఎలాంటి ఛరిష్మా లేదు. ఆ మాటకు వస్తే.. ఈ పదవిలో ఉండే వారు ముఖ్యమంత్రిని సైతం ప్రభావితం చేయటమే కాదు..తాము ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆర్థిక మంత్రి ఎలా రియాక్టు అవుతారన్న సందేహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుందా? అంటే.. అంత సీన్ ఆర్థిక మంత్రికి ఎక్కడ? అన్న ప్రశ్న వేస్తారు.కానీ.. రోశయ్య విషయంలో అలాంటి పప్పులు ఉడకవు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. ఆయన ఎవరికైనా ఏదైనా హామీ ఇవ్వాలంటే.. వేదిక మీద ఉన్న రోశయ్యను చూస్తూ.. ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో అంటూనే హామీలు ఇచ్చేవారు. సీఎంలను సైతం ప్రభావితం చేసే సత్తా ఆర్థిక మంత్రిగా ఉన్న రోశయ్యకే చెల్లు

2. విభజన వేళలో ఒక్క మాట అనిపించుకోని ఆంధ్రా నేత

విభజన ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నారన్న భావనతోనూ మాటలుఅనిపించుకున్న పరిస్థితి. ఇందుకు నాటి ప్రధాని మన్మోహన్ సైతం మినహాయింపు కాదు. కానీ.. ఆ వేళ సీఎంగా ఉన్న రోశయ్యను మాత్రం ఉద్యమ నేతలు మొదలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఒక్క మాట అంటే ఒక్క మాట అనలేదు. సమైక్య పాలకులు అన్నారే తప్పించి.. రోశయ్యను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శ చేయలేదు. దీనికి కారణం.. విషయాన్ని విషయంగా మాత్రమే కేంద్రానికి చెప్పిన నేతగా ఆయన నిలిచారు. అందుకే ఆయన్ను విమర్శించే సాహసం ఎవరూ చేసేవారు కాదు.

3. సీఎం ఎవరైనా ఆర్థికమంత్రి ఆయనే

ఒక రాజకీయ నేత.. ఆర్థిక మంత్రిగా ఒక రాష్ట్రానికి 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టటం అన్నది సాధ్యమవుతుందా? అంటే కాదని చెబుతారు రోశయ్య గురించి తెలీని వారు. కానీ.. అందుకు భిన్నంగాకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళలో ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. ఆర్థిక మంత్రి పదవి మాత్రం రోశయ్యకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పటి పరిస్థితి వేరు. పేరుకు ఆర్థిక మంత్రే కానీ.. వారి మార్కు ఎక్కడా కనిపించదు. కానీ.. రోశయ్య మాత్రం అందుకు భిన్నంగా ఆర్థిక మంత్రి పదవికే కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం.

4. సాయంత్రానికే క్వార్టర్ ఖాళీ

ఎంపీగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో క్వార్టర్ కేటయించటం మామూలే. పదవికి రాజీనామా చేసినా.. ప్రభుత్వ గడువు ముగిసిన తర్వాత ఎంపీ కాస్తా మాజీ అయ్యాక ఆర్నెల్ల కాలం అధికారిక క్వార్టర్స్ లో ఉండే వెసులు బాటు ఉంటుంది. కానీ.. రోశయ్యకు మాత్రం అలాంటివి అస్సలు నచ్చవు. తాను మాజీ అయిన రోజే.. గంటల వ్యవధిలోనే క్వార్టర్ ఖాళీ చేస్తారు. ఆర్నెల్లు గడువు ఉంది కదా? అన్నా వినిపించుకోరు. అంతేనా.. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత విలాసవంతమైన అధికారిక నివాసాన్ని ఇస్తే.. సున్నితంగా వద్దని చెప్పి తన ఇంట్లోనే ఉండేవారు. రోజు ఉదయాన్నే అధికార నివాసానికి వచ్చి.. అక్కడికి వచ్చిన సందర్శకుల్ని కలిసి వారి వినతులు స్వీకరించేవారు.

5. జయ నుంచి ఆ గౌరవం పొందిన ఒకే ఒక్కడు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆమె ఎంత కరకుగా ఉంటారో తెలిసిందే. అలాంటిది ఆమె సీఎంగా ఉన్న వేళ.. రోశయ్యను తమిళనాడు గవర్నర్ గా నాటి యూపీఏ సర్కారు నియమించింది. ఇదంతా తమకు రాజకీయ ప్రత్యర్థి అయిన జయలలితకు చెక్ పెట్టేందుకే అన్న ప్రచారం సాగింది. అలాంటి వేళ.. గవర్నర్ పదవిని చేపట్టేందుకు వచ్చిన రోశయ్యను సీఎం హోదాలో జయలలిత స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం పలికిన తీరు అప్పట్లో అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. గతంలో ఏ గవర్నర్ కు ఇలాంటి మర్యాదను ఇవ్వలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా జయలలితతో పేచీ పడకుండా ఉండటమే కాదు.. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వలేదు. అంతేకాదు.. ఆర్థిక అంశాల విషయంలో రోశయ్య సలహాల్ని జయలలిత పాటించేవారని చెబుతారు. గవర్నర్ పదవీ కాలం ముగిసిన తర్వాత చెన్నై ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు వస్తున్న రోశయ్యను.. ఆరోగ్యం అంత బాగోలేని వేళలోనూ జయలలిత స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి ఆయనకు వీడ్కోలు పలికారు. ఇలాంటివి రోశయ్య రాజకీయ జీవితం ఎన్నో ఉందంతాలున్నాయి.