రోశ‌య్య అన్న‌..వైఎస్సార్ ప్రేమ‌

కొణిజేటి రోశ‌య్య‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌లో వెలుగు వెలిగిన నాయ‌కులు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన నేత‌లు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగారు. ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య విడ‌దీయ‌రాని అనుబంధం ఉండేది. దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హ‌యాంలోనూ రోశ‌య్య ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. నాయ‌కుడ‌నే డాంబికం ఈగో అనేది ఆయ‌న‌కు అస్స‌లు ఉండేది కాదు. ఓ మంచి నేత‌గా రాజ‌కీయ విలువ‌లు పాటించి అంద‌రితో మ‌న్న‌న‌లు పొందిన ఆయ‌న శ‌నివారం తుది శ్వాస విడిచారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అనేక మంది ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర రోశ‌య్య ప‌నిచేశారు. మ‌ర్రి చెన్నారెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి, అంజ‌య్య‌, నేదురుమిల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇలా ఈ సీఎంల ద‌గ్గ‌ర ఆయ‌న మ‌న్న‌న‌లు పొందారు. వీళ్లంద‌రిలో చూస్తే వైఎస్సార్‌తో రోశ‌య్య‌కు మంచి అనుబంధం ఉండేది. వీళ్లిద్ద‌రూ పార్టీలో క‌ష్ట‌ప‌డి పైకి ఎదిగారు. స్వ‌యం శ‌క్తినే న‌మ్ముకుని నాయ‌కులుగా మారారు. ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్న వైఎస్ సీఎం కాగా.. పార్టీ అధినాయ‌క‌త్వం న‌మ్మ‌కాన్ని చూర‌గొన్న రోశ‌య్య అనేక కీల‌క ప‌ద‌వులు పొందారు.

వైఎస్ హ‌యాంలో రోశ‌య్య ఆర్థిక శాఖ మంత్రిగా ప‌ని చేశారు. వైఎస్సార్ ఆయ‌న్ని ఆప్యాయంగా అన్నా అని పిలిచేవారు. మ‌రోవైపు వైఎస్సార్‌ను రాజశేఖ‌ర్ అని రోశ‌య్య సంబోధించేవారు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన వైఎస్సార్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తే త‌న గుండె ఝ‌ళ్లుమ‌నేద‌ని రోశ‌య్య ఓ సారి అసెంబ్లీలో చెప్పారు. అన్ని వ‌ర్గాల సంక్షేమం కోసం ఎక్క‌డికి వెళ్లినా వైఎస్సార్ వ‌రాలు ఇవ్వ‌డ‌మే అందుకు కార‌ణం. వైఎస్ ఇచ్చే హామీలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలతో ఖ‌జానా ఖాళీ కాకుండా కాపాడ‌టంలో రోశ‌య్య చాతుర్యం చూపారు.

మ‌రోవైపు రోశ‌య్య‌పై కూడా వైఎస్‌కు అంత న‌మ్మ‌కం ఉండేది. ఆయ‌న ఆర్థిక మంత్రిగా ఉన్నార‌నే భ‌రోసాతోనే వైఎస్ ఎలాంటి భ‌యం లేకుండా పాల‌న కొన‌సాగించార‌ని, కంటి నిండా నిద్ర‌పోయేవార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తుంటారు. 2009లో వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు స‌చివాలయంలోనే ఉన్న రోశ‌య్య ఎంతో బాధ ప‌డ్డార‌ని స‌మాచారం.  వైఎస్ క్షేమంగానే తిరిగి వ‌స్తార‌నే ఆయ‌న ఎంతో ఆశ‌తో ఎదురు చూశారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. వైఎస్ మ‌ర‌ణంతో రోశ‌య్య హృదయం ముక్క‌లైంది. ఇప్పుడు ఆయ‌న కూడా త‌న సోద‌రుడి బాట‌లోనే సాగిపోయార‌ని జ‌నం అనుకుంటున్నారు.