బాలయ్యకు రాయల్టీ కావాలట

‘నరసింహ నాయుడు’ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ ఎప్పుడూ అంత నిలకడగా, సవ్యంగా సాగింది లేదు. ఆ చిత్రం తర్వాత ఎనిమిదేళ్లకు పైగా ఆయనకు విజయం లేదు. ఆ స్థితిలో ‘సింహా’ సినిమాతో బాలయ్యకు అత్యావశ్యకమైన విజయాన్నందించాడు బోయపాటి శ్రీను. ఆపై మళ్లీ బాలయ్య కెరీర్ గాడి తప్పింది. ఆ స్థితిలో బాలయ్యను మరోసారి ఆదుకుంది బోయపాటినే. వీరి కలయికలో వచ్చిన ‘లెజెండ్’ కూడా సూపర్ హిట్ కావడం తెలిసిందే. కానీ ఆ స్థాయి విజయం బాలయ్యకు మళ్లీ దక్కలేదు. పైగా యన్.టి.ఆర్, రూలర్ సినిమాలు పెద్ద డిజాస్టర్లు కావడంతో బాలయ్య కెరీర్ మరింత పతనమైంది కూడా. ఈ స్థితిలో మళ్లీ బాలయ్య బోయపాటినే నమ్ముకున్నాడు.

వీరి కలయికలో మరో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకపోయినా సరే.. ఈ సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రం హౌస్‌ఫుల్స్‌తో ఆడింది.రెండో రోజు కూడా ‘అఖండ’ జోరు తగ్గించేలా లేదు. మొత్తానికి ‘అఖండ’ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్నందుకునేలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య చాలా రిలాక్స్డ్‌గా కనిపించాడు గురువారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్లో. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో దర్శకుడు బోయపాటితో కలిసి సినిమా చూసిన అనంతరం బాలయ్య.. ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. అందులో బాలయ్యను చూసి అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య అంత కూల్‌గా, రిలాక్స్డ్‌గా కనిపిస్తూ ప్రశాంతంగా.. తడబాటు లేకుండా మీడియాతో మాట్లాడటం అరుదు.

మళ్లీ మంచి విజయాన్నందుకున్న నేపథ్యంలో బాలయ్య చాలా రిలాక్స్డ్‌గా ఉన్నట్లున్నాడు. ఆయన ఈ ప్రెస్ మీట్లో చాలా సరదాగా కూడా మాట్లాడారు. ఇంటర్వెల్లో పిల్లలు కొందరు తనను అంకుల్ అన్నారని.. అది నచ్చలేదని.. తనను తాత అనాల్సిందని నవ్వేశాడు బాలయ్య. అంతే కాక మధ్యలో దర్శకుడు బోయపాటి తనకు ‘అఖండ’ సినిమాకు సంబంధించి రాయల్టీ ఇవ్వాలని బాలయ్య వ్యాఖ్యానించడం విశేషం. మామూలుగా తాను దేవుడిని చూపించు అన్న వాళ్లను ఒక దెబ్బ కొట్టి మాట్లాడతానని.. ఆ నొప్పి కనిపించిందా అని అడిగి, అదే దేవుడు అంటానని.. తన దగ్గర అది గమనించే ‘‘దేవుడిని కరుణించు అనాలి. కనిపించు అని కాదు’’ అని డైలాగ్ పెట్టి ఉంటాడని, అందుకే తనకు రాయల్టీ ఇవ్వాలని బాలయ్య వ్యాఖ్యానించడం విశేషం.