‘అఖండ’కు ఏపీ ప్రభుత్వం షాకులు

ఈ ఏడాది వేసవిలో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు అన్నీ క్యాన్సిల్ చేయడం, టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం తెలిసిందే. అప్పటికి కేవలం ఆ సినిమా వరకే ఈ షాకులు అనుకున్నారు కానీ.. ఆ తర్వాత కూడా ఇదే విధానాన్ని కొనసాగించడం టాలీవుడ్‌కు చాలా ఇబ్బందికరంగా మారింది. గత కొన్ని నెలల్లో వచ్చిన ఏ సినిమాకూ అదనపు షోలు లేని సంగతి తెలిసిందే. ఐతే చాన్నాళ్ల తర్వాత తెలుగులో ‘అఖండ’ అనే భారీ చిత్రం రిలీజైంది.

ఈ సినిమా విడుదలకు ముందు రోజే బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉండవని.. నాలుగు షోలు మాత్రమే వేయాలని జీవో రిలీజ్ చేశారు. కానీ ‘అఖండ’ను ప్రదర్శించిన మెజారిటీ థియేటర్లో అదనపు షోలు వేశారు. బెనిఫిట్ షోలు కూడా పెద్ద ఎత్తునే పడ్డాయి. ఇందుకు లోకల్‌గా అనుమతులు తీసుకున్నారా.. లేక ఎవరికి వాళ్లు సైలెంటుగా షోలు వేసేశారా అన్నదానిపై క్లారిటీ లేదు.ఐతే ఉదయం మార్నింగ్ షో కంటే ముందు.. తెల్లవారుజామున బెనిఫిట్ షో, ఆ తర్వాత మరో షో పడుతున్నపుడు అధికారులెవరూ అడ్డుకోలేదు. దీంతో అనధికారికంగా బెనిఫిట్ షోలు, అదనపు షోలకు అనుమతులు ఇచ్చేశారని, లేదా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అనుకున్నారు.

కానీ సాయంత్రానికి కథ మారిపోయింది. ఏపీలో పలు చోట్ల అధికారులు థియేటర్లపై దాడులు జరిపారు. తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలు వేసిన థియేటర్లకు నోటీసులిచ్చారు. ఒకట్రెండు థియేటర్లను సీజ్ కూడా చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాక మార్నింగ్ షో షెడ్యూల్ టైం కంటే ముందు ఒక షో పడ్డ నేపథ్యంలో కొన్ని చోట్ల సెకండ్ షోలను రద్దు చేయించారు. అలా నాలుగు షోలకే పరిమితం చేశారు. దీంతో మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఆందోళన మొదలైంది. ఉదయం ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి సాయంత్రానికి ఇలా కొరడా ఝులిపించడంతో రాబోయే పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.