ఆ కమిట్‌మెంటే నచ్చుతోంది

కన్నుమూసి తెరిచేలోగా స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందాన్న. అదృష్టవంతురాలు అన్నారందరూ. అయితే ఆమెని ఈ స్థాయికి చేర్చింది లక్ మాత్రమే కాదు.. ఆమె పడే కష్టం కూడానంటోంది పుష్ప టీమ్. ఇందులో శ్రీవల్లి అనే డీగ్లామరస్ రోల్ చేస్తోంది రష్మిక. ఆ పాత్రకి న్యాయం చేయడం కోసం తనెంత కష్టపడిందో వాళ్లు చెబుతున్నారు.      ‘రంగస్థలం’లో సమంతను అచ్చమైన పల్లెటూరి యువతిగా చూపించిన సుకుమార్.. ‘పుష్ప’లో రష్మికను కూడా అలాగే చూపించబోతున్నాడు. ఆల్రెడీ ఆమె లుక్ రిలీజైంది. పర్‌‌ఫెక్ట్ విలేజ్‌ గాళ్‌లా ఉందంటూ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అయితే లుక్కే కాదు, ఆ పాత్రలో రష్మిక నటన కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట.

శ్రీవల్లి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి పెద్ద హోమ్‌ వర్కే చేసిందంట రష్మిక. రకరకాల మేనరిజమ్స్, ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసిందట. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ గురించి చాలా రీసెర్చ్ చేసిందట. ఈ సినిమా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతూ ఉండటంతో ఆ యాస కోసం చాలా కష్టపడిందట. తిరుపతి వెళ్లినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి, అక్కడి జనాలతో మాట్లాడి మరీ ఆ ప్రాంతవాసుల లైఫ్‌ స్టైల్, బాడీ లాంగ్వేజ్, కల్చర్ ఎలా ఉంటాయో తెలుసుకుందట. అంత కష్టపడింది కాబట్టే ఆ పాత్ర స్థాయిని పెంచేలా నటించింది అంటున్నారు. దాంతో శ్రీవల్లి క్యారెక్టర్‌‌పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. 

నిజానికి ఈ టీమే కాదు.. ఆమె నటిస్తోన్న బాలీవుడ్‌ మూవీ ‘మిషన్ మజ్ను’ టీమ్ కూడా రష్మికను ఆకాశానికి ఎత్తేస్తోంది. తను చాలా టాలెంటెడ్ మాత్రమే కాదు, హార్డ్ వర్కింగ్‌ అని.. చాలా క్రమశిక్షణతోను, శ్రద్ధతోను వర్క్ చేస్తుందని పొగిడేస్తున్నారు. పని విషయంలో రష్మిక కమిట్‌మెంట్ సూపరని, తనలాంటి హీరోయిన్ దొరకడం హ్యాపీగా ఉందంటూ ఆ మూవీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ప్రశంసించాడు. దీన్నిబట్టే అర్థమవుతోంది.. రష్మిక ఇవాళ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎలా అయ్యిందో.