మమత-కేజ్రీవాల్లో ఎవరిది పైచేయి ?

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని అందుకునేందుకు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు పై ఇద్దరు ఎవరికి వీలైనంతగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా డెవలప్మెంట్లు చూసిన తర్వాత వీరిద్దరు ఏరూపంలో కూడా  కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు లేరని అర్ధమైపోతోంది. తాజాగా ముంబాయ్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ అసలు యూపీఏ అనేది ఉందా ? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గురించి మాట్లాడుతూ యూపీయేనా అదెక్కడుంది ? అని వేసిన ప్రశ్నలే ఫైర్ బ్రాండ్ వైఖరికి అద్దం పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ లీడర్లను తృణమూల్ కాంగ్రెస్ లో మమత చేర్చేసుకుంటున్నారు. కీర్తి ఆజాద్, అశోక్ తన్వర్, సుస్మితా దేవ్, మేఘాలయాలో 12 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను మమత తన పార్టీలో చేర్చుకున్నారు. వీళ్ళే కాకుండా గోవా, త్రిపుర, ఉత్తరప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలను కూడా చేర్చుకుంటున్నారు. అంటే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే టార్గెట్ గా మమత పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.

ఇదే సమయంలో మరోవైపు నుండి కేజ్రీవాల్ కూడా ఇదే పద్ధతిలో వెళుతున్నారు. ఢిల్లీలో హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్న కేజ్రీవాల్ పంజాబ్ లో అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవాలో కూడా ఆప్ పోటీకి రెడీ అయిపోతోంది. అందుకనే పై రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలను చేర్చుకునే విషయమై గురిపెట్టారు. కేజ్రీవాల్ కూడా పై రాష్ట్రాల్లో బలమైన కాంగ్రెస్, బీజేపీ నేతలను ఆప్ లో చేర్చుకుంటున్నారు.

వివిధ రాష్ట్రాల్లో అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మమత, కేజ్రీవాల్ దెబ్బలకు మరింత బలహీనమైపోతోంది. వీళ్ళ దూకుడు చూస్తుంటే దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు బలమైన నేతలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. జాతీయంగానే కాకుండా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పనైపోయిందని వీళ్ళద్దరు ఒకటే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు ఒకటే నినాదాన్ని ఎత్తుకోవటం, ప్రధానంగా కాంగ్రెస్ నేతలపైనే టార్గెట్ పెట్టుకోవటంతో వీళ్ళద్దరి మధ్య పోటీ పెరిగిపోయింది.

మరిలాంటి నేపధ్యంలో ఇద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు ? అనేది కీలకంగా మారింది. వచ్చే ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలే వీళ్ళద్దరిలో ఎవరిది పై చేయో తేల్చేయబోతోంది. ఎందుకంటే రెండు పార్టీలు కూడా గోవా, మణిపూర్, పంజాబ్ లో పోటీ చేయబోతున్నాయి. ఇరుపార్టీల అభ్యర్ధుల్లో ఎవరెక్కువ చోట్ల గెలిస్తే సహజంగా ఆ పార్టీదే పైచేయి అయ్యిందని అనుకోవాల్సుంటుంది. ఇద్దరి వ్యక్తిత్వాన్ని పోల్చితే మాత్రం జనాలు కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య పోటీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినేసేట్లుంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.