ఏపీలో టికెట్ల రేట్లపై దర్శకేంద్రుడి ఆవేదన

తెలుగు సినిమాల వరకు మేజర్ మార్కెట్ షేర్.. ఆంధ్రప్రదేశ్ ‌నుంచే వస్తుంది. మన సినిమాలకు ఎక్కువగా బిజినెస్ జరిగేది.. వసూళ్లు ఎక్కువగా వచ్చేది ఏపీ నుంచే అన్నది అందరికీ తెలిసిన విషయం. బేసిగ్గానే ఆంధ్రా జనాలకు సినిమా అభిమానం ఎక్కువ. ఇక్కడ సినిమాలకు వచ్చే ఆదరణే వేరు.

ఐతే ఇండియాలోనే ఏరియాల పరంగా చూస్తే చాలా పెద్ద మార్కెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమాలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ రిలీజైన దగ్గర్నుంచి ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడంతో ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. ఆ ప్రభావం సినిమాల బిజినెస్ మీదా పడింది. గత కొన్ని నెలల్లో రిలీజైన ఏ సినిమాకూ ఆంధ్రాలో ఆశించిన ఫలితం రాకపోవడానికి టికెట్ల రేట్ల మీద నియంత్రణే కారణం. పరిశ్రమ నుంచి ఎంతమంది వెళ్లి ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపినా, ఎన్ని విన్నపాలు జరిగినా అటు నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్, సురేష్ బాబు లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే దీని మీద పరిశ్రమ నుంచి ఓపెన్‌గా మాట్లాడిన వాళ్లు లేరు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో ఇప్పుడు టాలీవుడ్ దిగ్గజాల్లో ఒకరైన దర్శకేంద్రుడు ఈ విషయమై స్పందించారు. ఒక ప్రస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఏపీలో ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లతో చాలామంది నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా అంటే థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతే గొప్పదని.. కానీ ఇప్పుడు షోలు తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్లను నమ్ముకున్న వాళ్లందరూ నష్టపోయి ఆ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని రాఘవేంద్రరావు అన్నారు. ఒక హిట్ సినిమాకు ఎక్కువ షోలు వేసుకుని, తొలి వారం టికెట్ల రేట్లు పెంచితే.. ఆ తర్వాత మామూలు సినిమాలు వచ్చినా, ఆదాయం తగ్గినా థియేటర్లను నమ్ముకున్న వేలాది మందికి 2-3 నెలలకు సరిపడా ఆదాయం వస్తుందని.. అసలు రిలీజయ్యే సినిమాల్లో 10 శాతం కూడా సక్సెస్ కావన్నది అందరికీ తెలిసిన సత్యం అని దర్శకేంద్రుడు అన్నారు.

ఒక హిట్ సినిమాకు 500 రేటు పెట్టినా ప్రేక్షకుడు చూస్తాడని.. బాలేని సినిమాను ఒక్క రూపాయికే చూపించినా చూడడని.. టికెట్లను పూర్తిగా ఆన్ లైన్ చేస్తే ఇన్ఫ్లూయెన్స్ ఉన్న వాళ్లు టికెట్లు బ్లాక్ చేసుకుని.. తమ వాళ్లతో బ్లాక్‌లో అమ్మే ప్రమాదం ఉందని.. ఆన్ లైన్ తప్పదనుకుంటే రేట్లు పెంచి ఆన్ లైన్లో అమ్మితే ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా ఎక్కువ వస్తుందని.. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి తగిన న్యాయం చేయాలని రాఘవేంద్రరావు కోరారు.