ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

ఏపీ ఆర్థిక స్థితి నానాటికి దిగజారిపోతోందని, ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఖజానా ఖాళీ కావడంతో ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం నానా తిప్పలు పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, లేటైనా సరే జీతాలిస్తున్నాం కదా అంటూ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

దానికి తోడు చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి వ్యవహారాలలో ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులు అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ ప్రకారం ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచణ నోటీసు ఇచ్చాయి.

ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు సహా విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించనున్నాయి. ప్రభుత్వం పిఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోందని  అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. సీఎం జగన్ జోక్యం చేసుకొని పీఆర్సీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చే జీతాలు తమ హక్కు అని అది భిక్ష కాదని అన్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిది అనుభవరాహిత్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయని, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయని చెప్పారు తమ న్యాయపరమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, అంతవరకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయనున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపు తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా ఉద్యమం చేయబోతున్నారని తెలుస్తోంది. మరి, ఈ వ్యవహారంపై ప్రభుత్వ స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.