బ్రహ్మికి సన్మానం చేస్తే.. ఆ రోజు నేల మీదే

Brahmanandam

తెలుగు సినిమా చరిత్రలో బ్రహ్మానందంది ఒక ప్రత్యేక అధ్యాయం. ఏ కొలమానంలో చూసినా సుదీర్ఘ తెలుగు సినిమా చరిత్రలో ఆయన్ని మించిన కమెడియన్ మరొకరు లేరు అంటే అతిశయోక్తి లేదు. మూడు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా నవ్వించిన ఆయన గత కొన్నేళ్ల నుంచే సినిమాలకు దూరం అయ్యారు. ఈ మధ్య ఎప్పుడో ఒక సినిమాలో మాత్రమే కనిపిస్తున్నారు. బయట కూడా బ్రహ్మానందం కనిపించడం తగ్గిపోయింది. ఐతే ఎంత సింపుల్‌గా ఉండే వ్యక్తికైనా అవార్డులన్నా, సన్మానాలన్నా, పొగడ్తలన్నా ఆసక్తి లేకుండా ఉండదు.

అవేమీ వద్దని దూరంగా ఉండపోయే వ్యక్తులు చాలా అరుదు. బ్రహ్మి కూడా ఇలాంటివి వద్దు అనే రకం ఏమీ కాదట. కానీ వీటి పట్ల ఒక రకమైన భయం మాత్రం బ్రహ్మిలో ఉందట. ఎవరైనా అవార్డిస్తాం, సన్మానాలు చేస్తాం అంటే బ్రహ్మి కాదనదట. కానీ అలా సత్కారం చేసుకున్న రోజు మాత్రం ఆయన లైఫ్ స్టైల్ మారిపోతుందట. ఎప్పుడే సభకు వెళ్లి సన్మానం చేయించుకున్నా సరే.. బ్రహ్మి ఆ రోజు ఇంటికొచ్చి నేల మీద మాత్రమే పడుకుంటాడట. సన్మాన కార్యక్రమంలో పొగడ్తలు ఎక్కడ తలకెక్కేస్తాయో అన్న భయమే ఇందుక్కారణమట. ఆలీ నిర్వహించే టీవీ షోలో దీని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రహ్మి. ‘‘జీవితంలో అన్నీ చూశాం.

పేదరికం, పస్తులు, బాధలు అన్నీ దాటి వచ్చాం. సన్మాన కార్యక్రమాలకు వెళ్తే అందరూ పొగుడుతారు. ఇలాంటి మాటలు విన్నపుడు తెలియకుండానే శరీరంలోకి అవి ఎక్కేస్తాయి. అహంకారం వస్తుంది. అందుకే అలా జరగకుండా ఉండేందుకు సన్మానం పూర్తయి ఇంటికి రాగానే లుంగీ కట్టుకుని, దుప్పటి వేసుకుని నేలపై పడుకుంటా. అలా చేయడం వల్ల మనల్ని మనం తెలుసుకోగలుగుతామని నా అభిప్రాయం. అది ఇంట్లో వాళ్లకు కూడా అలవాటైపోయింది. నేను సన్మానం నుంచి రాగానే లుంగీ, దుప్పటి నా ముఖాన పడేస్తారు’’ అంటూ నవ్వేశారు బ్రహ్మి.