మంత్రి కొడాలిని లేపేస్తా – మాజీ మంత్రి హాట్ కామెంట్లు..

వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై.. టీడీపీకి చెందిన యువ నాయ‌కుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర హాట్ కామెంట్లు చేశారు. ‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా..’ అంటూ హీటెక్కించారు. టీడీపీ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన జ‌రిగిన‌ ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో కొల్లు ఈ కామెంట్లు చేశారు. అయితే.. ఈ కామెంట్లు ఆల‌స్యంగా వెలుగు చూశాయి. వైసీపీ ప్రజా ప్రతినిధులు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, పవిత్రమైన చట్టసభల్లో మహిళలను కించపరుస్తున్న వారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆడపడుచులకు కొల్లు పిలుపునిచ్చారు.

అన్ని రాసి పెట్టుకుంటున్నామని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ మంత్రులకు సొంత శాఖలపై పట్టులేదని, బూతులంటే పోటీపడి మరీ మాట్లాడుతున్నారన్నారు.  గడిచిన 30 నెలల్లో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?, మహిళలపై జరుగుతున్న దాడులను ఆపగలిగారా? అని ప్రశ్నించారు.   సీఎం జగన్‌రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో మహిళను దారుణంగా చంపితే న్యాయం చేయలేని వైసీపీ పాలకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏం కాపాడతారని ప్రశ్నించారు.  నీచమైన సంస్కృతిని చాటుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులకు మహిళలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతోందన్నారు.

శాసనాలకు వేదిక అయిన అసెంబ్లీలో తెలుగింటి ఆడపడుచును అవమానించేలా వైసీపీ ప్రజాప్రతిని ధులు ప్రవర్తించారన్నారు. రాబోయే రోజుల్లో ప్రశ్నించిన ప్రతి సామాన్యుడి అమ్మ, అక్క, చెల్లి, భార్య శీలాన్ని నడిబజారులో అవమానించి పైశాచికానందం పొందినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. గ‌త రెండున్న‌రేళ్లుగా .. మంత్రి కొడాలి.. టీడీపీపైనా.. అధినేత చంద్ర‌బాబుపైనా విరుచుకుప‌డుతున్నా.. ఏ ఒక్క‌రూ స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు కు జ‌రిగిన అవ‌మానం నేప‌థ్యంలోఅంద‌రూ ఏక‌మ‌వుతున్న‌ట్టుగా సంకేతాలు పంపిస్తున్నారు. ఇదే క‌ట్టుబాటు.. క‌లివిడి.. కొన‌సాగితే.. మంత్రికి అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.