అటు రోగి, ఇటు వైద్యుడు.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు

దుర‌దృష్టం వెంటాడితే.. ఎంతో కొంత న‌ష్ట‌పోయినా త‌ప్పుకోవ‌చ్చు. త‌ప్పించుకోవ‌చ్చు. కానీ, దుర‌దృష్నానికి దారుణం కూడా తోడైతే.. ఊహించ‌డానికే భ‌యాన‌క ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి.. దారుణ‌మైన ఘ‌ట‌న .. తెలంగాణ‌లోనే చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. ప్ర‌పంచంలోను.. ముఖ్యంగా మ‌న దేశంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న ప‌రిస్థితి లేదు. అరుదైన ఘ‌ట‌న‌ల్లో అత్యంత అరుదైన ఘ‌ట‌న‌గా ఈ ఘ‌ట‌న నిలిచిపోయింది. గుండెపోటు వచ్చిన రోగికి చికిత్స చేస్తుండగా.. చికిత్స చేస్తున్న‌ వైద్యుడికీ గుండెపోటు వ‌చ్చింది!

ఇలాంటి ఘ‌ట‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఎదురు కాలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణ‌లోనే జ‌రిగింది. దీంతో అటు రోగి, ఇటు వైద్యుడు.. ఒకేచోట‌(ఆప‌రేష‌న్ ధియేట‌ర్‌) కుప్ప‌కూలి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగింది. కామారెడ్డి జిల్లా గిరిజ‌న ప్రాంత‌మైన‌ గాంధారి మండలం గుజ్జుల్తండాకు చెందిన సర్జు అనే వ్యక్తికి ఆదివారం ఉద‌యం హ‌ఠాత్తుగా గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం గాంధారిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కు తీసుకొచ్చారు. ఎంతో అనుభ‌వ‌జ్ఞుడైన న‌ర్సింగ్ హోం డాక్ట‌ర్ ల‌క్ష‌ణ్‌.. స‌ర్జుకు ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ విష‌యాన్ని ఆయ‌న వెంట ఉన్న బంధువుల‌కు చెప్పారు. దీనికి వారు కూడా ఓకే చేశారు. దీంతో వెంట‌నే ఆయ‌న ఆప‌రేష‌న్ ప్రారంభించారు. ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ కోసం.. ప్రారంభిస్తుండ‌గా.. ఒక్క‌సారిగా.. డా.లక్ష్మణ్కు కూడా గుండెపోటు వచ్చింది. పేషేంట్ను చూస్తూనే డాక్టర్ కింద పడిపోయారు. క్షణాల్లోనే అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రోగిని కుటుంబ సభ్యులు కామారెడ్డికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్కి చెందిన డా.లక్ష్మణ్ నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ వైద్యకళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న అంద‌రినీ విస్మ‌యానికి.. విషాదానికి కూడా గురిచేయ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇలాంటి ఘ‌ట‌న ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకోక‌పోవ‌డమే కార‌ణం!! ఇంత‌కు మించిన దుర‌దృష్టం.. దారుణం.. ఇంకేముందని అంటున్నారు.. ఈ విష‌యం తెలిసిన వారు. నిజ‌మే క‌దా!!